
ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ పాలన లేదని, ‘రెడ్ బుక్’ పాలన సాగుతోందని వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీ మరణాలు, పోలీసుల వేధింపులను ఉటంకిస్తూ, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Key Points
వైఎస్ జగన్ ప్రకారం ఏపీలో చట్టబద్ధ పాలన లేదు, కేవలం 'రెడ్ బుక్' పాలనే సాగుతోంది.
గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావించారు.
పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారని జగన్ ఆరోపణ.
సామాన్య ప్రజలు కూడా పోలీసుల వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు అత్యంత భయపడేది పోలీసులకేనా అనే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న కస్టడీ మరణాలు, ఆత్మహత్యలపై శనివారం హాలో ఇండియా పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.
గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే పోలీసుల వేధింపుల తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ్ఛిక విషాదాలు కావని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న “రెడ్బుక్ పాలన” పెంచి పోషించిన ప్రమాదకర సంస్కృతికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలని ఆయన దుయ్యబట్టారు.
“ఆంధ్రప్రదేశ్లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్బుక్ ప్రకారం నడుచుకుంటున్నారా…? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు,” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగమే నేడు పోలీసింగ్కు సరికొత్త నిర్వచనంగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడే తాము హెచ్చరించామని, రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను వాడుకుంటే వ్యవస్థలు పూర్తిగా కలుషితమవుతాయని తాము చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని గుర్తుచేశారు.
కస్టడీ మరణాలు, పోలీసుల వేధింపులపై ఆగ్రహం
రెడ్బుక్ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేశారని, ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులపై వేధింపులకు దిగారని వైఎస్ జగన్ విమర్శించారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ అదుపు తప్పిన పోలీసింగ్, ఇప్పుడు సామాన్య ప్రజలను కూడా వేధింపులకు, బెదిరింపులకు గురిచేసే స్థాయికి చేరిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిందన…. కనీసం తన కుమారుడి అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి అధికారులను వేడుకునే దుస్థితి రావడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భయంకరమైన పరిస్థితి అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ లాగే తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాలో కళావతి అనే మహిళలు పోలీసుల వేధింపుల వల్లే సెల్ఫీ వీడియోలు తీసి ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగానే మరణించిందని, ఆమె మృతదేహాన్ని కూడా రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు న్యాయ విచారణ కోరుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కోడి కోశారన్నా, మేక కోశారన్నా.. చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తుల పాత్రలు తామే పోషిస్తూ మోరల్ పోలీసింగ్కు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోవైపు వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే కేసులు కూడా నమోదు చేయడం లేదని, ఈ ద్వంద్వ వైఖరి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు.
చంద్రబాబు ‘రెడ్ బుక్’ పాలనపై తీవ్ర విమర్శలు
ఈ ఘోరమైన పరిస్థితులకు రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ, ఇలాంటి రెడ్బుక్ పాలన కాదని స్పష్టం చేశారు. పోలీసులు రాజకీయ ప్రతీకారానికి పనిముట్లుగా మారకుండా…. ప్రజల హక్కులను కాపాడాలని హితవు పలికారు.
ఏపీలో చట్టబద్ధ పాలన లేదని జగన్ ఆరోపణలు రాష్ట్రంలో భీతావహ పరిస్థితులను సూచిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు తక్షణ చర్యలు డిమాండ్ చేశారు.


