
ఒకప్పుడు ఏడాదికి 17 సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఒకానొక దశలో నిర్మాత రామానాయుడు గారితో కలిసి విజయశాంతి హీరోయిన్ గా నటించాల్సిన ఒక సినిమా ఆగిపోయింది. కృష్ణ క్రేజ్ తగ్గింది, కథ బాగాలేదంటూ ఆ ప్రాజెక్టును ఆపేశారు. దీనిపై కృష్ణ ఇచ్చిన కూల్ రియాక్షన్ ఆసక్తికరం.
Key Points
సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి నటించాల్సిన ఒక సినిమా ఆగిపోయింది.
నిర్మాత రామానాయుడు బెంగాలీ రీమేక్ గా ఈ తండ్రి-కొడుకుల కథను ఎంచుకున్నారు.
కృష్ణ క్రేజ్ తగ్గిందని, కథపై అనుమానాలతో రామానాయుడు సినిమాను ఆపేశారు.
సినిమా ఆగిపోయినందుకు కృష్ణ చాలా కూల్ గా స్పందించారు.
దర్శకుడు చంద్ర మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు ఏడాదికి 17 సినిమాల్లోకి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణ డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు. కృష్ణ ఎంత బిజీగా ఉన్నా ఓపిగ్గా అన్ని సినిమాలు పూర్తి చేసేవారు. 90వ దశకం చివరికి వచ్చేసరికి కృష్ణ హీరోగా సినిమాలు చేయడం దాదాపుగా మానేశారు. చేసిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉండేవి.
ప్రేయసి రావే లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చంద్ర మహేష్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రేమ కథ తీసుకుని వెళ్లి తాను రామానాయుడు గారికి వినిపించినట్లు చంద్ర మహేష్ తెలిపారు. కానీ రామానాయుడు గారు ఒక బెంగాలీ సినిమా చూసి దానిని తెలుగు రీమేక్ చేద్దాం అని అన్నారు. మరి నా దగ్గర లవ్ స్టోరీ ఉంది కదా సార్ అని అడిగా.. సరే అయితే ఈ బెంగాలీ సినిమాని వేరే డైరెక్టర్ చేయించుకుంటా.. నీ సినిమా తర్వాత చూద్దాం అని అన్నారు.
రామానాయుడు సినిమా ఆపడానికి కారణాలు
ఈ విషయం వెళ్లి పోసాని కృష్ణ మురళి గారికి చెప్పా. రామానాయుడు గారితో అలా ఎందుకు అన్నావు. ఆ బెంగాలీ సినిమా రీమేక్ నువ్వే చేయి. లేకుంటే ఆయన నిన్ను దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత ఛాన్స్ ఇవ్వరు అని చెప్పారు. ఆ బెంగాలీ సినిమా తండ్రి కొడుకుల కథ సార్.. మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి సార్ అని చెప్పా. లేదు కథని నేను మారుస్తాను, నువ్వు దర్శకత్వం చేయి అని పోసాని అన్నారు. దీనికి రామానాయుడు గారు కూడా ఓకె చెప్పారు.
హీరోగా కృష్ణ గారిని అనుకున్నాం. తండ్రిగా కృష్ణ గారు వృద్ధుడి గెటప్ లో భారతీయుడు స్టైల్ లో చూపించాలని అనుకున్నాం. ఆయన భార్యగా విజయశాంతిని అనుకున్నాం. కృష్ణ గారికి చెబితే భలే ఉంది అయ్యా. చేద్దాం అని అన్నారు. ఒక కాలనీ సెట్ కూడా నిర్మించాం. కానీ ఇంతలో రామానాయుడు గారికి చాలా మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. తండ్రి కొడుకుల కథలు ఈ కాలంలో ఎక్కడ ఆడతాయి.. అవి ఫేడ్ అవుట్ అయిపోయాయి కదా అని అన్నారట. అదే సమయంలో కృష్ణ గారు హీరోగా నటించిన మానవుడు దానవుడు అనే సినిమా ఫ్లాప్ అయింది.
సినిమా ఆగిపోవడంతో కృష్ణ రియాక్షన్
ఇప్పుడు కృష్ణకి కూడా క్రేజ్ లేదు. పైగా ఈ కథ బాగాలేదని చాలా మంది చెబుతున్నారు. కాబట్టి సినిమా ఆపేద్దాం అని రామానాయుడు గారు అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సెట్ కూడా నిర్మించిన తర్వాత కృష్ణ గారు ఏమంటారో అని టెన్షన్ పడ్డా. ఆయనకి విషయం చెబితే ఏం పర్వాలేదు అయ్యా.. దానిదేముంది ఇంకో సినిమా చేసుకో అని చాలా కూల్ గా చెప్పారు. ఆ తర్వాత తాను శ్రీకాంత్ హీరోగా ప్రేయసి రావే అనే సినిమా చేసినట్లు చంద్ర మహేష్ తెలిపారు. కృష్ణ గారి సినిమా కోసం నిర్మించిన కాలనీ సెట్ ని ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా కోసం వాడుకున్నారు అని చంద్ర మహేష్ తెలిపారు.
సినిమా ఆగిపోయినా కృష్ణ గారు చాలా కూల్ గా స్పందించడం ఆయన గొప్ప మనస్తత్వానికి నిదర్శనం. “దానిదేముంది ఇంకో సినిమా చేసుకో” అంటూ ఆయన చెప్పిన మాటలు, ఆ పరిస్థితుల్లో ఆయన చూపిన పరిణతి ఎందరికో ఆదర్శం.


