
📌 Key Points
- ఇరాన్లో కూలిన అమెరికా ఎఫ్-15ఈ ఫైటర్ జెట్, పైలట్ను కాపాడేందుకు అమెరికా నేవీ దళాల రంగంలోకి దిగాయి.
- పైలట్ వద్ద ఉన్న సీఎస్ఈఎల్ పరికరం శత్రువుల కళ్లు గప్పి సమాచారం చేరవేయడంలో సహాయపడింది.
- 800 గ్రాముల బరువున్న ఈ పరికరం నీటిలో కూడా పనిచేస్తుంది, 21 రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
- గాయపడ్డానని, శత్రువులు దగ్గరగా ఉన్నారని, రమ్మని పైలట్ బటన్ నొక్కి సందేశాలు పంపవచ్చు.
ఇరాన్లో అమెరికా ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో అమెరికా నేవీ దళాలు రంగంలోకి దిగి తమ పైలట్ను రక్షించాయి. అతడి వద్ద ఉన్న ఒక చిన్న పరికరం ద్వారానే ఇది సాధ్యమైంది.
అమెరికా పైలట్ను కాపాడిన పరికరం ఏమిటి?
ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టి నెల రోజులు దాటిన అమెరికాకు రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. యుద్ధం మొదటి రోజే తమ ప్రధాన టార్గెట్ అయిన ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణించినా యుద్ధం ఆపే విషయంలో యూఎస్ ఇరాన్పై ఇంకా పట్టు సాధించలేకపోతోంది. ఈ క్రమంలో తమ ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ ఇరాన్ గడ్డపై కూలడంతో అమెరికాకు పట్టపగలే చుక్కలు కనబడేలా చేసింది. దీంతో ఫైటర్ జెట్ నుంచి ఎజెక్ట్ అయి ఇరాన్ గడ్డపై ల్యాండ్ అయిన తమ పైలట్ను రక్షించుకునేందుకు అమెరికా తన నేవీ ఫోర్స్ కు చెందిన విమానాల దండును ఇరాన్పైకి తరలించింది. ఓ వైపు యూఎస్ పైలట్ను ప్రాణాలతో పట్టుకునేందుకు ఇరాన్ సైతం తమ స్థానిక గిరిజన తెగల సహకారంతో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ శత్రు దళాల దృష్టి మళ్లించి అమెరికా ఎట్టకేలకు తమ పైలట్ను సురక్షితంగా తరలించుకుపోగలిగింది. ఈ ప్రయత్నంలో అమెరికా పైలట్ జాడ కనుకునేందుకు అతడు నడవగలిగే స్థితిలో ఉండటంతో పాటు అతడి వద్ద ఉన్న ఓ చిన్న పరికరమే అమెరికా దళాలకు సహాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఏమిటా పరికరం అనే చర్చ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.
పరికరం చిన్నదే ప్రయోజనాలే:
సీఎస్ఈఎల్ పరికరం ఎలా పనిచేస్తుంది?
ఇరాన్ దాడికి F-15E యుద్ధ విమానం దెబ్బతినడంతో విమానం నుంచి ఎజెక్ట్ అయిన పైలట్ దట్టమైన పర్వతాల్లో చిక్కుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 7 వేల అడుగుల ఎత్తున ఉన్న ఓ కొండ రాయి దగ్గర దాక్కున్న అతడి వద్ద సీఎస్ఈఎల్ (కాంబ్యాట్ సర్వైవర్ ఇవేడర్ లోకేటర్) అనే 800 గ్రాముల బరువు ఉండే ఈ చిన్న పరికరం మాత్రమే అతడి వద్ద ఉందని ఇదే అతడికి, అమెరికాకు పెద్ద ప్రయోజనం చేకూర్చినట్లు ఈ కథనం పేర్కొంది. అరచేతిలో ఇమిడిపోయేంతా పరిమాణంలో ఉండే ఈ పరికరం ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కంప్యూటర్. దీన్ని పైలట్ ధరించే సర్వైవల్ జాకెట్లో దీనిని అమర్చుతారు. విమానం నుంచి పైలట్ ఎజెక్ట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది.ఇది 10 మీటర్ల లోతు నీటిలో కూడా పనిచేస్తుంది. దీని బ్యాటరీ ఏకధాటిగా 21 రోజుల పాటు వస్తుంది. ఈ డివైజ్ అత్యంత శక్తివంతమైన ఎన్క్రిప్టెడ్ (Encrypted) డేటాను పంపుతుంది. అంటే శత్రువులు దీని సిగ్నల్స్ను అంత సులభంగా పసిగట్టలేరు. శత్రువులకు వినబడకుండా పైలట్ కేవలం బటన్ నొక్కడం ద్వారా ‘నేను గాయపడ్డాను’, ‘శత్రువులు దగ్గరగా ఉన్నారు’, ‘నన్ను తీసుకెళ్లడానికి రండి’ వంటి సందేశాలను తమ దేశానికి పంపవచ్చు. ఇది తన సిగ్నల్ ఫ్రీక్వెన్సీని నిరంతరం మారుస్తూ ఉంటడం వల్ల దీనివల్ల ఇరాన్ వద్ద ఉన్న రష్యా, చైనా తయారీ అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కూడా దీనిని ట్రాక్ చేయలేకపోయాయి.ఇది నేరుగా మిలిటరీ శాటిలైట్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్లకు పైలట్ లొకేషన్ వెంటనే తెలిసిపోతుంది.
యుద్ధ సమయంలో ఈ పరికరం యొక్క ప్రాముఖ్యత
ఈ పరికరం ఇచ్చిన సమాచారంతో తమ పైలట్ను గుర్తించిన అమెరికా రెస్క్యూ బృందం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి అమెరికన్ పైలట్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనే లక్ష్యంతో ఇరాన్ గిరిజన తెగలు, ఐఆర్జీసీ దళాలు, బసీజ్ ఫోర్స్ రంగంలోకి తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టాయి. ఒక దశలో ఇరాన్ దళాలు అమెరికా పైలట్ సమీపంలోకి వెళ్లగా వాటిని అమెరికా యుద్ధ విమానాలు బాంబింగ్ చేసి వాటిని దూరం తరిమాయి. అదే సమయంలో ఆరుగురు సభ్యుల నేవీ సీల్ బృందం ఇరాన్ భూభాగంపై దిగి తమ పైలట్ ను సురక్షితంగా రక్షించి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాయి. దీంతో తమ పైలట్ కోసం అమెరికా చేసిన ప్రమాదకర రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది.
చిన్న పరికరమైన సీఎస్ఈఎల్, క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. సాంకేతికత యుద్ధంలో ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.


