
📌 Key Points
- జార్ఖండ్లో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
- గ్రామ పంచాయితీ నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించింది
- జరిమానా డబ్బుతో పంచాయితీ సభ్యులు మద్యం విందు చేసుకున్నారు
- సామాజిక సంస్థలు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాయి
జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. గ్రామ పంచాయితీ నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించి, ఆ డబ్బుతో మద్యం విందు చేసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది.
జార్ఖండ్లో దిగ్భ్రాంతికర ఘటన
దేశవ్యాప్తంగా పోలీసు, న్యాయ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తున్నా.. అక్కడకక్కడ దిగ్భ్రాంతికరమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి సమాజం ఎటువైవపు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మూడేళ్ల పసికందుపై ఓ మృగాడు అత్యాచారానికి ఒడిగడితే.. న్యాయం చేయాల్సిన గ్రామ పెద్దలు సభ్యసమాజం తలదించుకునేలా పంచాయితీ చెప్పారు. నిందితుడికి కేవలం రూ.1 లక్ష జరిమానా విధించడమే కాకుండా.. ఆ వచ్చిన డబ్బుతో పంచాయితీ సభ్యులంతా కలిసి మద్యం, విందు (Liquor Party) చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
పంచాయితీ పెద్దల వివాదాస్పద నిర్ణయం
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలోని ఓ పంచాయతీ పరిధిలో కేవలం మూడేళ్ల వయసు ఉన్న ఓ చిన్నారిపై స్థానికంగా ఉండే సునీల్ లోహరా అనే వ్యక్తి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘోరాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఊరిలోనే ఈ గొడవను సర్దుబాటు చేస్తామని, పోలీసుల వరకు వెళ్లకుండా తామే న్యాయం చేస్తామని స్థానిక పంచాయితీ పెద్దలు రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ జరిపినట్లు నాటకమాడిన ఖాప్ తరహా పంచాయితీ పెద్దలు.. నిందితుడు తప్పు చేసినట్లు అంగీకరించాడని చెబుతూ.. అతడికి రూ.లక్ష జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆ పంచాయితీ సభ్యులు, ఆ జరిమానా డబ్బును బాధితురాలి కుటుంబానికి ఇవ్వలేదు. ఆ డబ్బును వారి వద్దే పెట్టకుని.. ఆ రాత్రే అందరూ కలిసి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి విందులు, వినోదాలు చేసుకున్నారు.
సామాజిక సంస్థల ఆగ్రహం, న్యాయం కోసం డిమాండ్
అయితే, ఈ అమానవీయ ఘటనపై సమాచారం సామాజిక సంస్థలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ పసికందు జీవితాన్ని నాశనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, జరిమానా పేరుతో వసూలు చేసిన డబ్బుతో మందు పార్టీలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచర ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, నిందితుడితో పాటు చట్టాన్ని అపహాస్యం చేసిన పంచాయితీ పెద్దలపై కూడా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన సమాజంలో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసింది. నిందితుడితో పాటు పంచాయితీ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


