
📌 Key Points
- బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్ట్ బ్రేక్ వేసింది.
- నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్కు, ఈరోస్ ఇంటర్నేషనల్ కు మధ్య రూ.28 కోట్ల వివాదం కారణం.
- తెలంగాణలో అఖండ 2 బెనిఫిట్ షోలకు అనుమతి, టికెట్ రేట్లు పెంపు జరిగింది.
- వివాదం పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్ట్ బ్రేక్ వేసింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య రూ.28 కోట్ల వివాదం దీనికి కారణం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడంతోపాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం బాలయ్య అభిమానులను ఆశ్చర్యపరిచింది.
అఖండ 2 విడుదలకు హైకోర్ట్ బ్రేక్
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం `అఖండ 2`. బోయపాటి దర్శకత్వంలో సినిమా రూపొందింది. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే ఉంది. టీమ్ అంతా రిలీజ్కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ కంటెంట్ని పంపించారు. ఈ రాత్రి నుంచి అక్కడ ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరోవైపు ఏపీలోనూ బెనిఫిట్ షోస్ పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణలోనూ టికెట్ రేట్లు పెరిగాయి. సింగిల్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయలు పెంచింది. దీంతోపాటు ఈ రోజు గురువారం బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్ రూ.600గా నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవీ విడుదలయ్యింది. ఇలా అంతా రెడీ అవుతున్న సమయంలో ఇప్పుడు సడెన్గా బ్రేకులు పడ్డాయి. సినిమా విడుదల ఆపాలని హైకోర్ట్ వెల్లడించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో బాలయ్య అభిమానులకు పెద్ద షాకిస్తుంది. మరి ఎందుకు సినిమా ఆపాలని ఆదేశించిందనేది చూస్తే.
రూ.28 కోట్ల వివాదమే కారణమా?
`అఖండ 2 తాండవం` మూవీని నిర్మిస్తున్న సంస్థ 14 రీల్స్ ప్లస్. గతంలో ఇది 14 రీల్స్ పేరుతో సినిమాలు నిర్మించింది. ఆయా చిత్రాలకు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేన్ కి రూ.28కోట్లు చెల్లించాల్సి ఉందట. ఈ మేరకు ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆశ్రయించింది. తమకు ఇవ్వాలని డబ్బు సెటిల్ అయ్యేంత వరకు సినిమాని విడుదలకు ఆపాలని కోర్ట్ ని ఆశ్రయించగా, జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణ్యం, జస్టిస్ సి కుమారప్పన్ లతో కూడిన డివిజన్ బెంచ్ సినిమా రిలీజ్కి బ్రేక్లు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే తమకు చెల్లించాల్సిన రూ.28కోట్ల చెల్లించాలని పిటిషన్లో ఈరోస్ పేర్కొనగా ఈ వివాదం సెటిల్ అయ్యేంత వరకు సినిమా విడుదల ఆపాలని తెలిపింది. దీంతో బాలయ్య సినిమాకి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సెటిల్మెంట్కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ రూ.28కోట్ల పంచాయితీ ఎప్పుడు తెగుతుందో చూడాలి.
తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్లు
ఇదిలా ఉంటే `అఖండ` మూవీ నాలుగేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. అప్పుడు అఖండ విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో దానికి సీక్వెల్ని తీసుకొచ్చారు. ఇందులో భారీ తారాగణం ఉంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో మామూలు నాయకుడిగా, మరో పాత్రలో అఘోరగా కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్ సంయుక్త కీలక పాత్ర పోషిస్తోంది. ఆమెతోపాటు పూర్ణ, హర్షాలీ సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతత్వం మెయిన్గా చేసుకుని సనాతన ధర్మం గొప్పతనం చెప్పే సినిమాగా దీన్ని రూపొందించారు బోయపాటి. మరి ఈ సినిమా ఎంత వరకు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి.
అఖండ 2 సినిమా విడుదలపై నెలకొన్న రూ.28 కోట్ల వివాదం ఎప్పుడు సమసిపోతుందో వేచి చూడాలి. అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో కోర్టు ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని చిత్ర బృందం ఆశిస్తోంది.


