
📌 Key Points
- అమెరికాలో రెంట్ హౌస్ కావాలంటే 700 పాయింట్ల క్రెడిట్ స్కోర్ తప్పనిసరి.
- ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లడంతో ఇళ్ల లభ్యత 6%కి పడిపోయింది.
- భారతీయులు అధికంగా ఉన్న నగరాల్లో రెంటల్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
- క్రెడిట్ స్కోరుతో పాటు గ్యారెంటీ, రెండు నెలల సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారు.
అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది చేదు వార్త. అక్కడ రెంట్ హౌస్ తీసుకోవాలంటే కచ్చితంగా క్రెడిట్ స్కోర్ ఉండాలి. లేకపోతే ఎంత డబ్బున్నా, టాలెంట్ ఉన్నా ఇల్లు దొరకడం కష్టమే.
అమెరికాలో అద్దె ఇళ్ల కొరత
జీవితంలో త్వరగా స్థిరపడాలంటే.. చాలా మంది యువతకు ముందుగా కనిపించేది అగ్రరాజ్యమైన అమెరికా. అక్కడికి వెళ్లి సెటిలవ్వాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. అవకాశాలకు కొదువ ఉండదు. అయినవారు పక్కన లేకపోయినా.. అక్కడ వచ్చే లక్షల జీతం కోసం అన్నింటినీ వదులుకుని వెళ్తారు. ఇప్పుడు అలా అమెరికా వెళ్లేవారికి అమెరికా మరో షాకిచ్చింది. కలల సౌధంలో జీవించేందుకు రెంట్ హౌస్ కావాలంటే క్రెడిట్ స్కోర్ ఇంత ఉండాల్సిందేనన్న కండీషన్ పెట్టింది.
భారతీయులకు క్రెడిట్ స్కోర్ నిబంధనలు
చేతినిండా డబ్బు, టాలెంట్ ఉన్నా.. ఇప్పుడు అక్కడున్న భారతీయులను అద్దె కష్టాలు వెంటాడుతున్నాయి. అర్హత ఉన్నా తిరస్కరిస్తుండటంతో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎంత పెద్ద జీతం వచ్చే ఉద్యోగం ఉన్నా.. అద్దె ఇంటికోసం అప్లై చేస్తే ఆన్సర్ మాత్రం రిజెక్టెట్ అని వస్తుంది. కారణం ఏంటంటే క్రెడిట్ స్కోర్ 700 పాయింట్లు ఉండాల్సిందేనని కండీషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తుండటంతో.. అక్కడి ఇళ్ల లభ్యత 6 శాతానికి పడిపోయింది. దీంతో ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు పలు రకాలుగా విచారించి.. సాకులు చూపుతున్నారు. ఇది యాదృశ్చికంగా జరుగుతోందా లేక.. కావాలనే చేస్తున్నారా ? అన్న అనుమానం రోజురోజుకూ బలపడుతోంది.
వలసదారుల ఆవేదన, ఆందోళనలు
అమెరికాలో ఉన్న అతిపెద్ద వలస సమూహాల్లో మనవాళ్లూ ఉన్నారు. ఒకటి, రెండు కాదు.. అధికారిక లెక్కల ప్రకారం ఏకంగా 45 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. ప్రధాన నగరాల్లో రెంటల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి స్థానిక, ఆర్థిక చరిత్ర లేనివారిని ఇంటి యజమానులు తిరస్కరిస్తున్నారు. వారిలో భారతీయులే ఎక్కువ. క్రెడిట్ స్కోరుతో పాటు.. అమెరికాలో స్థిరపడిన వారి గ్యారెంటీ కూడా ఉండాలని, రెండునెలల సెక్యూరిటీ డిపాజిట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆర్థిక భద్రత మాటున జరుగుతున్న వివక్ష కాదా ? అన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. అర్హతలు, ఆర్థిక స్తోమత ఉన్నా.. మాకు ఇల్లు దొరకదా ? అని అక్కడికి వెళ్లినవారు సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందుతున్నారు.
అర్హత ఉన్నా అద్దె ఇల్లు దొరకని పరిస్థితి నెలకొనడం వివక్షేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


