
📌 Key Points
- రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం
- మారతున్న జనాభాకు అనుగుణంగా వార్డుల పరిధిని హేతుబద్ధీకరించనున్నారు.
- పునర్విభజన తర్వాత మొత్తం వార్డుల సంఖ్య 3,942కి చేరనుంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించింది. మారుతున్న జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచనున్నారు. దీనికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది.
వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం
AP Municipal Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించింది.
మారుతున్న జనాభా సమీకరణాలకు అనుగుణంగా వార్డుల పరిధిని హేతుబద్ధీకరించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం. వార్డుల పునర్విభజనలో భాగంగా పాత, కొత్త డివిజన్లకు నాలుగు వైపులా స్పష్టమైన హద్దులను అధికారులు నిర్ణయిస్తారు. ఈ సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
ఆ తర్వాత దీనిపై స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరిస్తారు. ప్రజలు సూచించిన మార్పులు, చేర్పులను పరిశీలించిన అనంతరం, జిల్లా కలెక్టర్ల ద్వారా తుది నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వార్డుల తుది జాబితాను ప్రకటిస్తారు.
జనాభా ప్రకారం వార్డుల హద్దుల నిర్ణయం
పునర్విభజన ప్రక్రియతో పురపాలక సంస్థల్లో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. మొత్తం డివిజన్లు/వార్డుల సంఖ్య 3,942కి చేరనుంది. తాజా ప్రక్రియతో కొత్తగా 772 వార్డులు అందుబాటులో ఉంచాయి.
పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరగడం, కొత్తగా కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో వార్డులను పెరగనున్నాయి. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయితేనే ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలోని 13,100 పంచాయతీల్లోని పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మరో 250 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర కారణాలతో అప్పట్లో ఎన్నికలు జరగలేదు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు నియమితులయ్యారు. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగనుంది.
మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు
గ్రామ పంచాయతీల పాలకమండలి పదవీ కాలం ముగియటంతో ఈసీ కూడా వేగం పెంచనుంది. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాలు ప్రచురితమయ్యాయి. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి…. ఎక్కడా పొరపాట్లు లేకుండా ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
తాజా పరిణామాలు చూస్తుంటే… ఏపీలో కూడా త్వరలోనే మున్సిపల్ , సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నగారా త్వరలోనే మోగే అవకాశం ఉండటంతో… రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు… మిగతా పార్టీలన్నీ కూడా వార్డుల వారీగా వ్యూహాలపై దృష్టి పెట్టాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ, వార్డుల పునర్విభజన ప్రక్రియ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది.


