
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలిని ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు పార్టులు కలిపి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఐడియాను ఎనిమిదేళ్ల క్రితమే ఓ వ్యాపారవేత్త ట్విట్టర్ లో రాజమౌళికి సూచించారు. ఆనాటి ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
బాహుబలి పార్ట్ 1, 2 కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో రీ రిలీజ్ అవుతోంది.
అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
2017లో విక్రం నారాయణరావు ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెండు భాగాలను కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా విడుదల చేయాలని ఆ ట్వీట్ లో సూచన.
ఎనిమిదేళ్ల క్రితం వైరల్ అయిన ట్వీట్
Baahubali The Epic : బాహుబలి సినిమా తెలుగు పరిశ్రమ స్థాయిని ఏ రేంజ్ లో పెంచిందో అందరికి తెలిసందే. బాహుబలి పార్ట్ 1 మించి పార్ట్ 2 పెద్ద విజయం సాధించింది. రాజమౌళి ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి పాన్ ఇండియా సినిమాలకు రోడ్ వేశారు. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ బాహుబలిని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రెండు పార్టులని కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్నారు.(Baahubali The Epic)
బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా రిలీజ్ చేయమని ఓ వ్యాపారవేత్త ఎనిమిదేళ్ల క్రితమే తన ట్విట్టర్లో చెప్పాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
వ్యాపారవేత్త విక్రం నారాయణరావు సలహా
2017లో బాహుబలి 2 సినిమా విడుదలైన వారానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మే 6వ తేదీ 2017న ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో.. రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా 500 కోట్లు కలెక్షన్స్ రాబట్టచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు అని ట్వీట్ వేశారు.
‘బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్ వివరాలు
దీంతో ఎనిమిదేళ్ల క్రితం లాయిడ్ గ్రూప్ అధినేత వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన ఎప్పుడో ఈ సలహా ఇచ్చాడు, ఇప్పుడు నిజం అవుతుందని నెటిజన్లు అంటున్నారు.
బాహుబలిని ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే 500 కోట్లు వస్తాయని, అద్భుత అనుభూతిని ఇస్తుందని విక్రం నారాయణరావు 2017లో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన అంచనా నిజం కానుందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


