|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు

Published: 12-12-2025, 8:48 AM
Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
  • బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్‌లో తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో తప్ప గెస్ట్ రోల్స్ చేయలేదనే సెంటిమెంట్ ఉంది.
  • విక్టరీ వెంకటేష్‌ కోసం 1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ చిత్రంలో బాలయ్య ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు.
  • చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ బాలకృష్ణ ఎప్పుడూ ఇలా కనిపించలేదు.
  • ‘త్రిమూర్తులు’ సినిమాలో ఒక పాటలో బాలకృష్ణతోపాటు అనేక మంది సినీ ప్రముఖులు అతిథి పాత్రలో మెరిశారు.

బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో తప్ప వేరే ఏ హీరో చిత్రాల్లోనూ గెస్ట్ రోల్స్ చేయలేదు. అయితే విక్టరీ వెంకటేష్‌ కోసం ‘త్రిమూర్తులు’ సినిమాలో ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టారు. చిరంజీవి, నాగార్జునలకు కూడా చేయని ఈ సాహసంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

బాలయ్య 50 ఏళ్ల కెరీర్ సెంటిమెంట్

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలయ్యకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌ శనివారం(డిసెంబర్‌ 13న) తన 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించి ఒక క్రేజీ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. వెంకటేష్‌ కోసం బాలయ్య తన 50ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టడం విశేషం.

నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇన్నాళ్ల కెరీర్‌లో ఆయన తన తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు కూడా చేశారు. గెస్ట్ రోల్‌ చేసింది కూడా తండ్రి సినిమాల్లోనే. మిగిలిన ఏ హీరో సినిమాల్లోనూ ఆయన గెస్ట్ గా కనిపించలేదు. దాన్ని ఆయనొక సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అప్పట్లో మంచు మనోజ్‌ నటించిన `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` చిత్రంలోనే ముఖ్య పాత్రలో కనిపించారు, కానీ గెస్ట్ రోల్‌ కాదు. కానీ వెంకటేష్‌ విషయంలోనే తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టాడు బాలయ్య.

వెంకటేష్‌ కోసం ఆ సెంటిమెంట్‌ బ్రేక్

వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి వారు హీరోలుగా నటించిన సినిమా `త్రిమూర్తులు`. కె మురళీ మోహనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1987లో విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. ఎందుకంటే ఈ సినిమాలో అనేక మంది స్టార్స్ నటించారు. ఓ పాటలో చిత్రపరిశ్రమ నుంచి బిగ్‌ స్టార్స్ తళుక్కున మెరవడం విశేషం. ఇందులో వెంకటేష్‌ కోసం బాలయ్య కూడా కనిపించారు. గెస్ట్ రోల్స్ చేయననే తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టి పాటలో ఆయన కూడా మెరిశారు. చిరంజీవి, నాగార్జున వంటి వారి సినిమాల్లోనూ ఎప్పుడూ ఆయన కనిపించలేదు. కానీ వెంకీ కోసమే సాహసం చేశారు బాలకృష్ణ. మళ్లీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆయన ఇలా కనిపించింది లేదు.

ఇక ఈ సినిమాతో బాలయ్యతోపాటు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఇలా ఇండస్ట్రీలోని టాప్‌ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్ లుగా కనిపించారు. అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు వంటి రెండో తరం హీరోలు, చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్‌ వంటి మూడో తరం నటులు కలిసి నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు` కావడం విశేషం.

చిరు, నాగ్ ల కోసం చేయని సాహసం

హీరోలే కాదు హీరోయిన్లు కూడా చాలా మంది నటించారు. విజయశాంతి, రాధా, భనుప్రియా, శారద, రాధిక, సుమలతతోపాటు శోభన, ఖుష్బూ, అశ్విని వంటి వారు నటించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం చెందింది. బాలీవుడ్‌లో వచ్చిన `నసీబ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగులో మాత్రం డిజప్పాయింట్‌ చేసింది. ఇక రేపు పుట్టిన రోజు జరుపుకుంటున్న వెంకటేష్‌ ప్రస్తుతం `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం 47`లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి హీరోగా రూపొందుతున్న `మన శంకరవర ప్రసాద్‌గారు` చిత్రంలోనూ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది.

ఇక బాలయ్య వరుసగా నాలుగు హిట్లు అందుకొని జోరుమీదున్నారు. ఇప్పుడు `అఖండ 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నేడు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ఫలితంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 111 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే ప్రారంభించుకుంది. హిస్టారికల్‌ కథతో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

‘త్రిమూర్తులు’ చిత్రం తెలుగు సినీ చరిత్రలో అనేక మంది స్టార్స్ కలిసి మెరిసిన ఒక ప్రత్యేక సినిమాగా నిలిచింది. వెంకటేష్ కోసం బాలకృష్ణ తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టడం వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని, ఆనాటి సినీ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.