
📌 Key Points
- దిల్లీ లిక్కర్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు జారీ, బంజారాహిల్స్లోని నివాసంలో అందజేత
- కేజ్రీవాల్, సిసోడియాతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసిన సీబీఐ
- మార్చి 16న హైకోర్టులో విచారణ, న్యాయ బృందంతో సంప్రదింపులు జరుపుతున్న కవిత
- 2021లో దిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురావడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారులు వచ్చి సమన్లు జారీ చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో వేడిని రాజేసింది.
కవితకు సీబీఐ నోటీసులు: అసలేం జరిగింది?
దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు గురువారం సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారుల బృందం వచ్చి సమన్లు జారీ చేసింది. కవితతో పాటు వ్యాపారవేత్తలు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు అందాయి.
దిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని కొన్ని రోజుల కిందట రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ దిల్లీ హైకోర్టులో అప్పిల్ చేసింది. దీంతో దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది.
దిల్లీ లిక్కర్ పాలసీ వెనుక ఆరోపణలు, వివాదాలు
దీనిపై కల్వకుంట్ల కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీబీఐ నాకు నోటీసు అందజేసింది. మార్చి 16, 2026న హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ ఉంది. నేను నా న్యాయ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నాను. అధికారిక మార్గాల ద్వారా తగిన విధంగా స్పందిస్తాను. నిజం గెలుస్తుందని నమ్మకం ఉన్న వ్యక్తిగా, నేను అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. దర్యాప్తు సంస్థ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసినప్పుడు నోటీసు అందజేయడం నిర్దేశించిన చట్టపరమైన విధానం. అదే విధంగా దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను.’ అని కవిత అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో అవకతవకలు, స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున విమర్శల పాలైంది ప్రభుత్వం. దీంతో దిల్లీ సర్కార్ 2022 సెప్టెంబర్లో పాలసీని వెనక్కు తీసుకుంది. కానీ అప్పటికే లైసెన్సుల కేటాయింపులు, ఎక్సైజ్ పాలసీ సవరణలో భారీ అక్రమాలు జరిగాయని, ఆప్ నేతలు, మరికొందరు మనీలాండరింగ్కు పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ ఆరోపణలు చేశాయి.
కవిత స్పందన: న్యాయపరమైన సలహాలు, సహకారం
లైసెన్స్దారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం నిందితులు భారీగా డబ్బులు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలతోపాటుగా కల్వకుంట్ల కవితను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జైలు శిక్ష, బెయిల్ మీద విడుదల అయ్యారు. ఇటీవలే ఈ కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. కానీ సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది.
మొత్తానికి దిల్లీ లిక్కర్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.


