
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ఆయన 24 ఏళ్ల తర్వాత తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్తో పాటు బలమైన భావోద్వేగాలను పంచుతుందని తెలుస్తోంది.
Key Points
చిరంజీవి ఇటీవల మాస్ సినిమాల నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు.
సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో రానున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి 24 ఏళ్ల తర్వాత తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
'డాడీ' సినిమా తర్వాత మళ్ళీ భావోద్వేగమైన తండ్రి పాత్రను పోషించనున్నారు.
చిరంజీవి సినిమాల్లో కొత్త మార్పులు?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మాస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన ఏజ్ కి తగ్గ సినిమాలు చేయట్లేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. గతంలోనే ఎన్నో ప్రయోగాలు, మంచి సినిమాలు చేసిన మెగాస్టార్ ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారని ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు.(Chiranjeevi)
కానీ ఇటీవల చిరంజీవి ఒప్పుకున్న నాలుగైదు సినిమాల లిస్ట్ చూస్తే చిరంజీవి తన సినిమాల్లో వ్యత్యాసం చూపించడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. చిరంజీవి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నయనతార, క్యాథరిన్ త్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
24 ఏళ్ల తర్వాత తండ్రి పాత్రలో చిరు
నేడు దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చిరంజీవి ఇద్దరు పిల్లలతో సరదాగా సైకిల్ తొక్కుతున్నట్టు ఉంది. ఇటీవల ఈ సినిమా కథ టాలీవుడ్ లో వైరల్ అయింది. ఈ పోస్టర్ తో మరోసారి చర్చగా మారింది.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో.. చిరంజీవి, నయనతార భార్యాభర్తలు అని, వాళ్ళిద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోతారని, చిరంజీవి స్పెషల్ ఆఫీసర్ గా ఓ ఆపరేషన్ కి వెళ్తే అక్కడ నయనతార మళ్ళీ కలుస్తుందని, ఈ జంటకు ఇద్దరు పిల్లలు అని, మళ్ళీ ఈ ఫ్యామిలీ ఎలా కలుస్తుంది అని ఎంటర్టైన్మెంట్స్ తో చెప్పనున్నట్టు తెలుస్తుంది.
సంక్రాంతికి ఎమోషనల్ ఎంటర్టైనర్
అయితే చాన్నాళ్ల తర్వాత చిరంజీవి ఇందులో తండ్రి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు పిల్లలకు తండ్రిగా పిల్లలు దూరమైతే ఉండే ఎమోషన్ కూడా సినిమాలో ఉండబోతున్నట్టు టాక్. చిరంజీవి అప్పుడెప్పుడో 24 ఏళ్ళ క్రితం డాడీ సినిమాలో నాన్నగా కనపడి మంచి ఎమోషన్ చూపెట్టారు. ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. అందులో చిరంజీవి తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు.
ఆ తర్వాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులా కనిపించాడు చిరంజీవి కానీ అది డ్యూయల్ రోల్ కావడంతో కమర్షియల్ సినిమాలా మిగిలింది. మళ్ళీ ఇన్నాళ్లకు చిరంజీవి తండ్రి పాత్రలో ఎమోషన్ చూపించబోతున్నారని తెలుస్తుంది. దీంతో ఈసారి అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఇవ్వనున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చెయ్యట్లేదు అనే ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాలి.
‘డాడీ’ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ తండ్రి పాత్రలో నటించడం ఆసక్తిగా మారింది. ఈసారి సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


