
📌 Key Points
- భర్త తనకంటే 21 ఏళ్లు పెద్దవాడని, అతనితో ఉండలేనని యువతి హైకోర్టుకు తెలిపింది.
- మేజర్ అయినందున తన నిర్ణయాలు తానే తీసుకోగలనని యువతి కోర్టుకు విన్నవించింది.
- వ్యక్తిగత స్వేచ్ఛలో భాగం ఆర్టికల్-21 ప్రకారం భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది.
- యువతి భద్రత కోసం 6 నెలల పాటు మహిళా వాలంటీర్ల పర్యవేక్షణకు కోర్టు ఆదేశించింది.
మధ్యప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన భర్తతో ఉండలేనని ఓ యువతి హైకోర్టును ఆశ్రయించగా, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది.
భర్తతో ఉండలేనని కోర్టుకు తెలిపిన యువతి
పెళ్లంటే రెండు మనసుల కలయిక అంటారు.. కానీ ఆ మనసు కలవని చోట, వయసు అంతరం భారమైతే ఆ బంధమే సంకెళ్లుగా మారుతాయి. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గ్వాలియర్ (Gwalior)లో చోటుచేసుకుంది. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం, ఓ మేజర్ మహిళ తన భాగస్వామిని ఎంచుకునే పూర్తి హక్కు ఆమెకే ఉంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన భర్తతో ఉండలేనని, తనకిష్టమైన వ్యక్తితోనే ఉంటానని స్పష్టం చేసిన ఆ యువతికి హైకోర్టు అండగా నిలిచింది.
యువతి వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు
వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల ఓ యువతి, వయసులో తన కంటే 21 ఏళ్లు పెద్దవాడైన 40 ఏళ్ల వ్యక్తితో జరిగిన వివాహ బంధంలో ఇమడలేకపోయింది. ఆ వివాహంలో తాను సంతోషంగా లేనని, తనను సరిగ్గా చూసుకోవడం లేదని పేర్కొంటూ ఆమె తనకిష్టమైన మరొక భాగస్వామితో వెళ్లిపోయింది. దీనిపై ఆమె భర్త, తన భార్యను ఎవరో అపహరించారని ఆరోపిస్తూ ‘హేబియస్ కార్పస్’ (Habeas Corpus) పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్పై జస్టిస్ ఆనంద్ పాఠక్ (Anand Pathak,), జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ (Pushpendra Yadav)ల విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బాధిత యువతి కోర్టు ఎదుట హాజరై తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నేను మేజర్ను. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. నా భర్త నాకంటే చాలా పెద్దవాడు. ఆ బంధంలో నేను ఇమడలేకపోతున్నా. ప్రస్తుతం నేను నా ఇష్టపూర్వకంగానే నా భాగస్వామితో కలిసి ఉంటున్నా. నన్నెవరూ నిర్బంధించలేదు’ అంటూ కోర్టుకు విన్నవించింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదని తీర్పు
ఇరుపక్షాల వాదనాలు విన్న హైకోర్టు ధర్మాసనం బాధిత యువతికి ఆమెకు కాసేపు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా ఆర్టికల్-21 ప్రకారం ఓ మేజర్ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎవరి జోక్యం ఉండకూడదని చెబుతుందని అన్నారు. మహిళ తన ఇష్టపూర్వకంగానే వేరే వ్యక్తితో ఉంటున్నప్పుడు, అది అక్రమ నిర్బంధం కిందకు రాదని కోర్టు స్పష్టం చేస్తూ భర్త దాఖలు చేసిన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ను కొట్టేసింది. ఆమె భద్రత దృష్ట్యా, వచ్చే 6 నెలల పాటు మహిళా వాలంటీర్లు ఆమె యోగక్షేమాలను పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఈ తీర్పు మహిళల వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛను గౌరవించడంలో మరొక మైలురాయిగా నిలిచిందని న్యాయ నిఫుణలు భావిస్తున్నారు.
మొత్తానికి, ఈ తీర్పు వ్యక్తిగత హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. మహిళల స్వేచ్ఛకు న్యాయస్థానాలు అండగా ఉంటాయని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది.


