
దృశ్యం ఫ్రాంచైజీతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు జీతూ జోసెఫ్ కొత్త చిత్రం ‘మిరాజ్’ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. సోనీ లివ్లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ సినిమా కథ, నటీనటుల గురించి తెలుసుకుందాం.
Key Points
దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తాజా చిత్రం 'మిరాజ్' సోనీ లివ్లో విడుదలైంది.
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న థ్రిల్లర్ ఇది.
ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు.
మనీ లాండరింగ్, మిస్సింగ్ హార్డ్ డిస్క్ చుట్టూ కథ తిరుగుతుంది.
‘మిరాజ్’ కథ: ఉత్కంఠభరితమైన ట్విస్టులు
మలయాళం సినిమాలు ఓటీటీలో ఇటీవల ఆడియన్స్ కి మంచి టైం పాస్ గా మారాయి. ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడేవారు మలయాళం సినిమాల కోసం సెర్చ్ చేస్తున్నారు. మలయాళం నటీనటులు, దర్శకుల నుంచి ఏదైనా సినిమా వస్తే ఓటీటీలో దూసుకుపోతున్నాయి. దృశ్యం ప్రాంచైజీతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బాగా పాపులర్ అయ్యారు. ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ ‘మిరాజ్’.
మిరాజ్ చిత్రం ఇటీవల సోనీ లివ్ లో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమాని అస్సలు మిస్ కాకూడదు. కథ సింపుల్ గానే ఉంటుంది. కానీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ పెట్టిన ట్విస్టులకి మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించారు. సంపత్ రాజ్ పోలీస్ అధికారిగా, హన్నా రెజీ కోషి హీరోయిన్ స్నేహితురాలిగా, హకీమ్ షాజహాన్ విలన్ గా నటించారు.
నటీనటుల అద్భుత ప్రదర్శన
కిరణ్ (హకీమ్ షాజహాన్), అభిరామి ( అపర్ణ బాలమురళి) ఇద్దరూ రాజశేఖర్ అనే వ్యాపారవేత్త వద్ద ఉద్యోగం చేస్తుంటారు. పైకి ఒక ట్రేడింగ్ కంపెనీలా ఉన్నప్పటికీ రాజశేఖర్ బడా వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ తో మనీ లాండరింగ్ చేస్తుంటారు. కిరణ్, అభిరామి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లి చేసుకుని ఇద్దరూ విదేశాల్లో సెటిల్ కావాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో కిరణ్ చనిపోయినట్లు అభిరామికి తెలుస్తుంది. కిరణ్ చనిపోయినప్పటి నుంచి అభిరామికి సమస్యలు మొదలవుతాయి. కిరణ్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కోసం రాజశేఖర్ మనుషులు ఆమె వెంట పడతారు. మరో వైపు పోలీస్ అధికారి ఎస్పీ ఆర్ముగం (సంపత్ రాజ్) కూడా అభిరామిని హార్డ్ డిస్క్ కోసం విచారిస్తారు. అదే సమయంలో ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ గా ఉన్న అశ్విన్ (అసిఫ్ అలీ) రంగంలోకి దిగి అభిరామిని హార్డ్ డిస్క్ గురించి అడుగుతాడు. మొదట అభిరామి అతడిని నమ్మదు. కానీ అతడు మంచివాడు అని తెలుసుకుని హార్డ్ డిస్క్ ని వెతికే పనిలో సాయం తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి హార్డ్ డిస్క్ కోసం వేట మొదలు పెడతారు. ఇంతమంది ప్రయత్నిస్తున్న ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది ? కిరణ్ నిజంగానే చనిపోయాడా ? హార్డ్ డిస్క్ తో అతడికి ఉన్న సంబంధం ఏంటి ? ఈ క్రమంలో అశ్విన్ కి ఎలాంటి నిజాలు తెలిశాయి ? అనేది మిగిలిన కథ.
థ్రిల్లర్ సినిమాల విషయంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయరు. మిరాజ్ మూవీతో మరోసారి ఈ జోనర్ లో జీతూ జోసెఫ్ తన పట్టు నిలుపుకున్నారు. హార్డ్ డిస్క్, డెత్ మిస్టరీ నేపథ్యంలో మొదలైన ఈ కథ ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా పాత్రల పరిచయంతో సాగుతుంది. ఈ చిత్రంలో పాత్రలన్నీ హార్డ్ డిస్క్ కోసం వెతకడం ప్రారంభించాక కథ వేగం పెరుగుతుంది. హార్డ్ డిస్క్ కోసం ప్రయత్నించే సమయంలో బయటపడే కొన్ని నిజాలు హీరో తో పాటు ప్రేక్షకులకు దిమ్మతిరిగేలా చేస్తాయి.
దర్శకుడు జీతూ జోసెఫ్ పనితనం
క్లైమాక్స్ లో ఎస్పీ ఆర్ముగం రివీల్ చేసే రెండు ట్విస్టులు నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయి. ఆ ట్విస్టులకు ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం కష్టం. అప్పటి వరకు సినిమా లెక్క వేరు ఆ రెండు ట్విస్టులతో లెక్క వేరు అన్నట్లుగా వ్యవహారం ఉంటుంది. హీరో అసిఫ్ అలీ, హీరోయిన్ అపర్ణ బాల మురళి పోటీ పడి నటించారు. సంపత్ రాజ్ పోషించిన పోలీస్ అధికారి పాత్ర ఈ కథకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది అనే చెప్పాలి. ఊహకందని ట్విస్టులు, పీక్ క్లైమాక్స్ తో ఉన్న ఈ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మొత్తంగా, జీతూ జోసెఫ్ తన థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ని నిరాశపరచలేదని ‘మిరాజ్’ మరోసారి నిరూపించింది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులకు పండుగ.


