
📌 Key Points
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
- ఐదుసార్లు లోక్సభ సభ్యునిగా ఎన్నికైన కావూరి
- యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు
- రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు దూరం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగు రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు.
కావూరి సాంబశివరావు జీవిత ప్రస్థానం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన…. హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కావూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5సార్లు లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుండి 3 సార్లు, ఏలూరు నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కావూరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ.. ప్రగతి ప్రగతి కన్స్ట్రక్షన్స్ స్థాపించారు. ఇందులో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు దూరం అవుతూ వచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం బలంగా గళం విప్పిన నేతల్లో కావూరి ఒకరు.
రాజకీయాల్లో కావూరి సేవలు
“సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు గారి మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వట్ చేశారు.
కావూరి మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి గారి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రముఖుల సంతాపం
“మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు గారి మరణం బాధాకరం. రాష్ట్ర రాజకీయాలకు కావూరి గారి మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసున్నా. 5 సార్లు ఎంపీ గా, UPA ప్రభుత్వంలో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి గారి సేవలు అనిర్వచనీయం” అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు.
కావూరి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏపీ, తెలంగాణలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ…. పోస్టులు చేస్తున్నారు.
కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ, వ్యాపార రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


