
📌 Key Points
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది.
- టెక్నాలజీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఐఆర్జీసీ నిర్ణయించినట్టు సమాచారం.
- ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్కు టెక్ కంపెనీల డేటా సెంటర్లు సహాయం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపణ.
- అమెరికన్ బ్యాంకులపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరిక.
మధ్యప్రాచ్యంలో యుద్ధం టెక్ వార్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాకు మద్దతు ఇస్తున్న టెక్నాలజీ దిగ్గజాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
టెక్ కంపెనీలను టార్గెట్ చేసిన ఇరాన్
మధ్యప్రాచ్యంలో చెలరేగిన యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ‘టెక్ వార్'(Tech War) గా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోంది. అమెరికా తన దాడులను తీవ్రతరం చేస్తున్న తరుణంలో, ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, అమెరికా, ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రపంచ స్థాయి యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలను, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. ఇరాన్ అనుబంధ వార్తా సంస్థ తస్నిం (Tasnim) వెల్లడించిన సమాచారం ప్రకారం.. అమెరికా తన సైనిక చర్యలకోసం, అలాగే నిఘా కోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఐఆర్జీసీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ జాబితాలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలున్నట్టు తెలియజేసింది.
ఇరాన్ టార్గెట్ లో గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), ఐబీఎం (IBM), ఎన్విడియా (Nvidia), ఒరాకిల్ (Oracle), పాలంటిర్ (Palantir) వంటి అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ నగరాల్లో, గల్ఫ్ దేశాలలో ఉన్న ఈ కంపెనీల క్లౌడ్ బేస్డ్ సర్వర్లను, డేటా సెంటర్లను ఇరాన్ టార్గెట్ చేయబోతోందని తెలిపింది. ఈ సంస్థల డేటా సెంటర్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్కు సహాయం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. టెక్ కంపెనీలతో పాటు, అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలనే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికన్ బ్యాంకులపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున, ఆయా బ్యాంకులకు ఒక కిలోమీటరు పరిధిలో సామాన్య ప్రజలు ఎవరూ ఉండవద్దని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. యుద్ధం మౌలిక సదుపాయాలకు విస్తరిస్తున్న కొద్దీ, తమ లక్ష్యాల పరిధి కూడా పెరుగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
గ్లోబల్ మార్కెట్పై ప్రభావం
గ్లోబల్ మార్కెట్పై ప్రభావం
ఇరాన్ హెచ్చరికల తీవ్రత
ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా టెక్ షేర్లలో అనిశ్చితి మొదలైంది. మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీల డేటా సెంటర్లపై దాడులు జరిగితే, అది కేవలం యుద్ధానికే పరిమితం కాకుండా గ్లోబల్ ఇంటర్నెట్ సర్వీసెస్, డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది. ఒకవైపు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఇరాన్ను నాశనం చేస్తామని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ప్రపంచ టెక్నాలజీ నాడిని దెబ్బతీస్తామని హెచ్చరిస్తోంది.
ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. టెక్నాలజీ యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.


