
📌 Key Points
- ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలపై దాడులకు హెచ్చరిక చేసింది.
- ఏప్రిల్ 1 నుంచి దాడులు మొదలవుతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.
- మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ సహా 18 కంపెనీల జాబితాను ఐఆర్జీసీ విడుదల చేసింది.
- ఉద్యోగులు వెంటనే కార్యాలయాలు విడిచి వెళ్లాలని, ప్రజలు ఆ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచన.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రాజుకుంటోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఏప్రిల్ 1 నుంచి దాడులు మొదలవుతాయని ప్రకటించింది.
అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్తత పరిస్థితులను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభిస్తామని ఇరాన్ వార్నింగ్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ దాడులు మొదలవుతాయని చెప్పడంతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఆందోళకర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1 రాత్రి 8 గంటల నుంచి పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా కంపెనీలపై దాడులు చేస్తాం. అందులో మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, గూగుల్, బోయింగ్, మెటా, ఇంటెల్, ఐబీఎం, డెల్, ఎన్విడియా, హెచ్పీ, సిస్కో, ఒరాకిల్, ప్లాంటర్, జే పీ మోర్గాన్, జీఈ, స్పైర్ సొల్యూషన్స్, జీ 42 సహా 18 కంపెనీల జాబితాను ఐఆర్జీసీ విడుదల చేసింది. ఇరాన్లో జరిగే ప్రతి హత్యకు బదులుగా, ఈ కంపెనీల సంబంధిత కేంద్రాలను ధ్వంసం చేస్తామని ప్రకటనలో పేర్కొంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ కంపెనీల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని సలహా ఇస్తున్నామని కూడా స్పష్టం చేసింది. ఆయా కంపెనీలను ‘ఉగ్రవాద కంపెనీలు’గా పేర్కొన్న ఐఆర్జీసీ, ఆ సంస్థల చుట్టూ నివసిస్తున్న వారు ఒక కిలోమీటరు పరిధిలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని సూచించింది.
ఏప్రిల్ 1 నుంచి దాడులు ప్రారంభం
భారీ నష్టం తప్పదా?
ఇరాన్ ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా టెక్ కంపెనీలు, ఉద్యోగులు, ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.


