
📌 Key Points
- కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
- నాలుగు రోజుల క్రితం ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది.
- భార్య మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపించడంతో చంద్రశేఖర్ ఒత్తిడికి లోనయ్యాడు.
- తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆయన భార్య కూడా సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య
కరీంనగర్ టౌన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులక్రితం ఆయన భార్య దివ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఆమె దశదిన కర్మల కోసం అత్తగారింటికి వెళ్లిన చంద్రశేఖర్… ఈ దారుణానికి ఒడిగట్టాడు.
గత నాలుగు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య… గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు. సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని ఆరోపించారు. ఓ దశలో దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
భార్య దివ్య మృతికి కారణాలు?
ఇవాళ ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన చంద్రశేఖర్…. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రుల మరణాలతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
అనాథలుగా మారిన చిన్నారులు
భార్య మృతి చెందటతో చంద్రశేఖర్ మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. దీనికితోడు భార్య మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపించడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన కరీంనగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


