
ప్రధాని నరేంద్ర మోడీ తన 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, భారత రక్షణ రంగంలో సాధించిన స్వదేశీ విజయాలను కొనియాడారు. భారత డిఫెన్స్ టెక్నాలజీపై ప్రపంచ దేశాలకు విశ్వాసం పెరుగుతోందని మోడీ అన్నారు.
Key Points
మోడీ 136వ మన్ కీ బాత్లో కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఐఎన్ఎస్ మహేంద్రగిరి, పినాకా, కుషా క్షిపణి వంటి స్వదేశీ రక్షణ విజయాలను ప్రస్తావించారు.
ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
భారత్ డిఫెన్స్ టెక్నాలజీపై ప్రపంచ దేశాలకు విశ్వాసం పెరుగుతోందని మోడీ అన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ స్మరణ
జీవితంలో కొన్ని తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదని జులై 26 అటువంటి తేదీల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ అని ఈ రోజు మనల్ని గర్వంతో నింపుతుందన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తన 136వ మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మన వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుందని మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారన్నారు. ఈసారి ఒక ప్రత్యేకమైన శౌర్య విజయ్ యాత్రను నిర్వహించారు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర నిర్వహించారని జులై 14న ప్రారంభమైన ఈ బైక్ యాత్ర కార్గిల్ లోని వార్ మెమోరియల్ కు చేరుకుంటుందన్నారు. ఒక రైడ్, ఒక దేశం, ఒక సెల్యూట్ నినాదంతో దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుందన్నారు.
భారత రక్షణ రంగంలో స్వదేశీ విజయాలు
మన దేశ యువత క్రీడారంగంలో అనేక అద్భుతమైన విజయాలను నమోదు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇటీవలే జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా తెలుగు తేజం పి.వి. సింధు నిలిచారని ఆమె విజయం పట్ల దేశం మొత్తం గర్విస్తోందన్నారు. లార్డ్స్ లో భారత మహిళల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకుందని ఈ గెలుపు చారిత్రాత్మకమైన విజయం అన్నారు.
ప్రపంచానికి పెరుగుతున్న భారత డిఫెన్స్ విశ్వాసం
కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నావికాదళంలో చేరిందని మోడీ గుర్తు చేశారు. ఈ అత్యాధునిక యుద్ధనౌకను మన దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారని ఇది ఆత్మనిర్భర్ భారత్ శక్తికి ప్రతీక అన్నారు. అలాగే ఈ నెలలో డీఆర్ డీవో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ను విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల క్రితం డీఆర్ డీవో కుషా క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం పెద్ద ఒప్పందం కుదిరిందని, భారత్ రక్షణ పరికరాలు, సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. విక్రమ్-1 విజయం ప్రతి పౌరుడిని గర్వంతో నింపిందని భారతీయ అంతరిక్ష రంగం సాధించిన చారిత్రాత్మక క్షణాన్ని మనందరం చూశామన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన మొదటి రాకెట్ ఇదని మన యువ ఆవిష్కర్తలు ఊహకందని విజయాన్ని సాధించారని చెప్పారు.
మొత్తంగా, ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ ద్వారా దేశ భద్రత, స్వయం సమృద్ధి, క్రీడలు, అంతరిక్ష రంగాలలో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించారు. దేశం అన్ని రంగాలలోనూ కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


