
📌 Key Points
- గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలను అరికట్టేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
- రెండు వరుస బుకింగ్ల మధ్య 25 రోజుల విరామం తప్పనిసరి చేసింది.
- ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఎల్పీజీ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.
- పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ హోర్డింగ్ను అరికట్టడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సామాన్యులకు ఊరట కలిగించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గ్యాస్ హోర్డింగ్ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు
అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై పడింది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దేశీయ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి పలు ఆదేశాలను జారీ చేసింది. అందులో.. ఆయిల్ రిఫైనరీలన్నీ తమ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, ఆ అదనపు ఉత్పత్తిని పూర్తిగా గృహ అవసరాలకే (Domestic use) కేటాయించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు (Hoarding), బ్లాక్ మార్కెటింగ్ను పూర్తిగా అరికట్టడానికి, రెండు వరుస బుకింగ్ల మధ్య ఖచ్చితంగా 25 రోజుల విరామం (Inter-booking period) ఉండాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల గ్యాస్ దుర్వినియోగం తగ్గడమే కాకుండా, సామాన్య ప్రజలకు సకాలంలో సిలిండర్లు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, దిగుమతి చేసుకున్న ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పారిశ్రామిక రంగాలకు గ్యాస్ సరఫరాను పర్యవేక్షించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ పరిశ్రమల నుండి వచ్చే అభ్యర్థనలను సమీక్షించి, సరఫరాపై నిర్ణయాలు తీసుకుంటుంది. గృహ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే, అత్యవసర సేవల రంగాలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యత పాటించడమే ఈ నూతన మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తుంది.
కొత్త నిబంధనలు: 25 రోజుల విరామం
అత్యవసర సేవలకు ప్రాధాన్యత
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ద్వారా గ్యాస్ సిలిండర్ల కొరతను నివారించవచ్చని, సామాన్యులకు సకాలంలో గ్యాస్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్గదర్శకాలు సత్ఫలితాలనిస్తాయో లేదో వేచి చూడాలి.


