
బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar)పై జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. చెడ్డవారితో సహవాసం చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయనే సామెతను గుర్తు చేస్తూ, నితీష్ కుమార్ ప్రస్తుత రాజకీయ స్థితికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. నితీష్ రాజకీయ బలహీనతలను ఆయన సొంత మనుషులే స్వార్థం కోసం వాడుకున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఆయన ఎప్పుడు బలహీనపడ్డారో, అప్పుడే ఆయన చుట్టూ ఉన్నవారే ఆయన్ను పూర్తిగా దెబ్బతీశారని కామెంట్ చేశారు. ఆ విషయం బిహార్ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. గతంలో 202 సీట్ల భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నడిపిన ఓ బలమైన నాయకుడు, ఇవాళ రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై పీకే (PK) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటి ఘనవిజయాన్ని అందుకున్న వ్యక్తి, కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం పదే పదే కూటములు మారుస్తూ తన సొంత రాజకీయ బలాన్ని తగ్గించుకున్నారని విమర్శించారు.


