
📌 Key Points
- తెలుగు హీరోలు కథలను పంచుకునే సంస్కృతిని పాటించారు, ఎన్టీఆర్ చాలా కథలను ఇతరులకు పంపారు.
- శోభన్ బాబు కెరీర్కు 1975లో విడుదలైన ‘జీవనజ్యోతి’ సినిమా భారీ బ్రేక్ ఇచ్చింది.
- ఈ సినిమా కథ మొదటగా ఎన్టీఆర్ కోసం రాసినది, ఆయన దగ్గరకు వెళ్ళింది.
- ఎన్టీఆర్ ఆ పాత్రకు శోభన్ బాబు సరైనవారని, ఆయనే న్యాయం చేయగలరని సూచించారు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఉన్నా, అప్పుడప్పుడు కథల విషయంలో పరస్పర సహకారం ఉండేది. అలాంటి ఒక సంఘటనలో, ఎన్టీఆర్ సూచనతో శోభన్ బాబు కెరీర్ను నిలబెట్టిన ఒక గొప్ప సినిమా గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
హీరోల మధ్య స్నేహం, కథల మార్పిడి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా .. హీరోల మధ్య పోటీ నడుస్తూనే ఉంటుంది. కొంత మంది మధ్య అయితే గొడవలు కూడా వస్తుంటాయి. అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ , ఎన్టీఆర్ కృష్ణ ల మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం హీరోలంతా కలిసి మెలిసి ఉండేవారు. ఎన్ని గొడవలు ఉన్నాయి.. తామంతా ఒక్కటే అన్న విధంగా ప్రవర్తించేవారు. కథల విషయంలో సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, తమ దగ్గరకు వచ్చిన కథలు వేరే హీరోకు పంపించడం లాంటివి చేసేవారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ చాలా కథలను బ్రదర్ ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. శోభన్ బాబు కెరీర్ కు ఊపునిచ్చిన జీవనజ్యోతి సినిమా కథ ఎన్టీఆర్ రికమండ్ చేసిందే.
టాలీవుడ్లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా శోభన్ బాబుకు పేరుంది. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్… ఇలా శోభన్ బాబుకు అభిమానుల నుంచి రకరకాల బిరుదులు ఉన్నాయి . వెండితెరపై నటన, స్టైల్, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్తో కోట్లాది ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు శోభన్ బాబు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే.. ఆయన హీరోగా స్థిరపడిన తరువాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించేవారు.
శోభన్ బాబు కష్టాలు, కెరీర్ మలుపు
హీరోగా నిలబడే వరకు శోభన్ బాబు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంగతి చాలామందికి తెలియదు. 1975లో విడుదలైన జీవనజ్యోతి సినిమా ఆయనకు భారీ బ్రేక్ ను అందించింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శోభన్ బాబు కెరీర్కి కీలక మలుపు తీసుకొచ్చింది.ఈ సినిమాకు కె. రామలక్ష్మి కథను అందించగా, డీవీఎస్ రాజు నిర్మించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా కథను శోభన్ బాబు కోసం రాయలేదు. ఎన్టీరామారావు కోసం ఈ కథను రాశారట. ముందుగా ఆయన దగ్గరకు ఈ సినిమా వెళ్లింది.
జీవనజ్యోతి సినిమా కథ మొదటగా నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావుకు వినిపించార. కథ పూర్తిగా వినగానే ఎన్టీఆర్, ఈ పాత్రకు తాను సరిపోనని.. శోభన్ బాబు అయితే ఈ క్యారెక్టర్ లో సూట్ అవుతాడని సూచించారు. ఈ కథకు శోభన్ బాబు అయితేనే సరిగ్గా న్యాయం జరుగుతుంది అని ఎన్టీఆర్ స్పష్టం చేశారట.తన కోసం వేరే కథను సిద్ధం చేయాలని, అది కూడా తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక చేస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఈ సలహాతో డీవీఎస్ రాజు, కె విశ్వనాథ్లు వెంటనే శోభన్ బాబును కలిసి కథ చెప్పారట.
జీవనజ్యోతి: ఎన్టీఆర్ చేసిన గొప్ప సిఫార్సు
ఈ సినిమాలో కథ బలం ఉండటం, ఎన్టీఆర్ స్వయంగా రికమండ్ చేయడంతో.. శోభన్ బాబు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో శోభన్ బాబు జోడీగా వాణిశ్రీ నటించారు. 1975 లో రిలీజ్ అయిన ‘జీవనజ్యోతి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమాకు కథతో పాటు పాటలు కూడా ప్రాణం పోశాయి. . కేవీ మహదేవన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయం గురించి, ఎన్టీఆర్ చేసిన సాయం గురించి శోభన్ బాబు కూడా పలు సందర్భాల్లో గుర్తు చేసుకుని రామారావుకు కృతజ్ఞతలు చెప్పుకునేవారు.
నిజానికి తనకోసం రాసిన కథను వేరొకరికి సిఫార్సు చేయడం ఎన్టీఆర్ గొప్ప మనసును చాటుతుంది. ఆయన సలహా శోభన్ బాబు కెరీర్కు జీవం పోసి, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.


