
📌 Key Points
- మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగియనుంది.
- దంతెవాడలో ఉన్నతాధికారులతో ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమీక్ష నిర్వహించారు.
- క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకొని వ్యూహాలు రూపొందించే లక్ష్యంతో బస్తర్లో సమావేశం జరిగింది.
- లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని డీజీపీ తెలిపారు.
మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ గడువు సమీపిస్తుండటంతో, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆపరేషన్ కగార్పై డీజీపీ సమీక్ష
మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్కు (Operation Kagar) గడువు సమీపిస్తోంది. మార్చి 31తో ఈ ఆపరేషన్ కు డెడ్ లైన్ ముగియనుండటంతో మిగిలిపోయిన మావోయిస్టుల విషయంలో ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ (DGP Arun Dev Gautam) స్పీడ్ పెంచారు. ఈ మేరకు నిన్న హోలీ సంబరాల అనంతరం దంతెవాడలో ఉన్నతాధికారులతో డీజీపీ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడీజీ (నక్సల్ ఆపరేషన్స్) వివేకానంద సిన్హా, బస్తర్ ఐడీ.పి సుందర్రాజ్, బస్తర్ డివిజన్లోని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, సీఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ దళాల సీనియర్ అధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో ఆపరేషన్ కగార్కు ఫినిషింగ్ టచ్ విషయంలో కీలక అంశాలపై చర్చించారు.
మావోయిస్టుల నిర్మూలనకు వ్యూహాలు
మావోయిస్టుల నిర్మూలనకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ప్రత్యేక్షంగా తెలుసుకోవడం అందుకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించే లక్ష్యాన్ని ఎంచుకునే దిశగా బస్తర్లో ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సమీక్షలో వేగవంతమై చర్యలకోసం భద్రతా బలగాల మధ్య సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ అమలు దిశగా అవసరమైన బ్లూ ప్రింట్పై చర్చించినట్లు డీజీపీ తెలిపారు. మిగిలిఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించామని ప్రాంతాలవారీగా అంచనా వేశామని రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాన్ని అణలు చేయబోతున్నట్లు వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం
బస్తర్ ఏరియాలో ఏరియాలో మావోయిస్టులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వారు ఇంకా పురోగమించే అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నామని డీజీపీ చెప్పారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోయేందుకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని సమయం మించిపోతోందని లొంగిపోవడమే వారి ముందున్న ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు. సకాలంలో ఆయుధాలు వదిలిపెట్టిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం అమలు చేసి వారు మెరుగైన జీవితాన్ని పొందే అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి ఆపరేషన్లో స్థానిక పోలీసులు చురుకుగా పాల్గొనవలసిన అవసరాన్ని ఈ సమీక్షలో అధికారులు నొక్కి చెప్పారు.
మావోయిస్టులు లొంగిపోవడానికి ఇదే చివరి అవకాశమని డీజీపీ అన్నారు. సకాలంలో లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.


