
📌 Key Points
- పాస్పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణ పత్రం మాత్రమే, పౌరసత్వానికి రుజువు కాదు.
- విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కీలక ప్రకటనను పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా చేసింది.
- ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వాన్ని నిరూపించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- జనన ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రుల నివాస రుజువులే పౌరసత్వానికి ఆధారం.
భారత పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాస్పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణ పత్రమే కానీ, పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ ఆధారం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమే
భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. సాధారణంగా భారతీయులకు మాత్రమే జారీ చేసే పాస్పోర్ట్ (Passport), దేశ పౌరసత్వాన్ని (Citizenship) నిరూపించే తుది పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. పాస్పోర్ట్ సేవా దివస్ (Passport Seva Divas) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.
ఆధార్, ఓటర్ ఐడీ పౌరసత్వానికి రుజువు కావు
విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాస్పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఓ అంతర్జాతీయ ప్రయాణ పత్రమేనని.. విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు మాత్రమే ప్రభుత్వం దీనిని జారీ చేస్తుందని తెలిపారు. ఓ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన భారతీయ జాతీయుడని (Nationality) ధృవీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప, అది దేశ పౌరసత్వానికి అంతిమ ఆధారం కాబోదని కేంద్రం పేర్కొంది.
పౌరసత్వాన్ని నిర్ధారించే అసలు పత్రాలు
ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక విచారణల సందర్భంగా ఆధార్ కార్డ్ (Aadhaar Card) అనేది కేవలం ఒక వ్యక్తి గుర్తింపు పత్రం (Identity) మాత్రమే కానీ, పౌరసత్వ నిరూపణ పత్రం కాదని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ ఐడీ కార్డ్ (Voter ID) కూడా కేవలం ఓటు వేయడానికి, నివాస ధృవీకరణకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ పౌరసత్వానికి కాదని పేర్కొంది. చట్టాల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రాలు (Birth Certificates) నిర్దేశిత సంవత్సరాల కంటే ముందు తల్లిదండ్రులు ఇక్కడే నివసించినట్లుగా ఉండే కేంద్ర ప్రభుత్వ అధికారిక పత్రాలే పౌరసత్వాన్ని డిసైడ్ చేస్తాయని విదేశాంగ పేర్కొంది.
మొత్తంగా, పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ వంటివి పౌరసత్వానికి రుజువులు కావని, జనన ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రుల నివాస రుజువులే అసలైన ఆధారాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఇది పౌరసత్వ చట్టాలపై స్పష్టతనిచ్చింది.

