|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan Singer: పవన్‌ పాట పాడితే మూవీ పోయినట్టేనా? ఏఏ సినిమాల్లో పాడారు? వాటి రిజల్ట్ ఏంటి?

Published: 24-09-2025, 9:45 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆయన పాట కూడా పాడారు. అయితే, పవన్ పాడిన పాటలు సినిమా ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం.

Key Points

1

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో జపనీస్ పాట పాడారు.

2

'హరి హర వీరమల్లు' సినిమాలోని పాట సినిమా ఫలితాలను ప్రభావితం చేయలేదు.

3

'అజ్ఞాతవాసి' సినిమాలోని పాట కూడా సినిమా పరాజయానికి కారణం కాదు.

4

పవన్ కళ్యాణ్ పాటలు పాడటం అనేది సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతుందా అనేది చర్చనీయాంశం.

పవన్ కళ్యాణ్ పాడిన పాటలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు `ఓజీ` సినిమాతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేయబోతుంది. అయితే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి యాక్షన్‌ మూవీ కావడం, అందులోనూ గ్యాంగ్‌ స్టర్‌ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఇలాంటి మాఫియా చిత్రం వచ్చి చాలా కాలమైంది. పైగా ఇలాంటి పూర్తి స్థాయి మాఫియా మూవీ రాలేదు. పూర్తి మాస్‌, యాక్షన్‌ మూవీ కావడం, విడుదలైన గ్లింప్స్ లు, ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పవన్‌ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్‌ చేస్తున్నారు. ఈ గురువారం నుంచి `ఓజీ` మూవీ థియేటర్‌లో విడుదలవుతుంది. అయితే ముందుగానే ఈ రోజు రాత్రి కొన్ని థియేటర్లలో బెనిఫిట్‌ షోస్‌ ప్రదర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే `ఓజీ` చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ పాట పాడారు. `వాషీ ఓ వాషీ` అంటూ సాగే పాటని ఆయన ఆలపించారు. ఇది జపాన్‌ లాంగ్వేజ్‌లో ఉన్న పాట కావడం విశేషం. దీంతో ఇది మరింత ఆసక్తిని పెంచుతోంది. పవన్‌ కళ్యాణ్‌ పాట పాడటం కొత్త కాదు. ఆయన అడపాదడపా పాటలు పాడుతూనే ఉన్నారు. ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. ఆయన గత చిత్రం `హరి హర హర వీరమల్లు` చిత్రంలో `మాట వినాలి గురుడా` అనే పాటని ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఈ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 24న విడుదలై భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. కానీ ఓవరాల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, ఏఎం రత్నం నిర్మించారు. ఈ మూవీ వల్ల భారీగా నష్టపోయారు ఏఎం రత్నం. పవన్‌ పాడిన పాట ఈ సినిమాకి వర్కౌట్‌ కాలేదు.

ఇప్పుడే కాదు అంతకు ముందు `అజ్ఞాతవాసి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ సినిమాలోనూ `కొడకా కోటేశ్వరరావు` అనే పాటని ఆలపించారు పవన్‌. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ మూవీ దారుణంగా పరాజయం చెందింది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటించారు. ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. సినిమాలో విషయం లేకపోవడంతో డిజాస్టర్‌గా నిలిచింది. పవన్‌ సాంగ్‌ సెంటిమెంట్‌ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. పైగా అది ట్రోల్స్ కి గురయ్యింది.

సినిమా ఫలితాల ప్రభావం

2013లో వచ్చిన `అత్తారింటికి దారేదీ` సినిమాలోనూ పాట పాడారు పవన్‌ కళ్యాణ్‌. `కాటమ రాయుడా కదిరీ నరసింహుడా`అంటే సాగే ఫోక్ సాంగ్‌ని ఆలపించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. బ్రహ్మానందం, సమంత, పవన్‌ ల మధ్య ఓ కామెడీ స్కిట్‌ సందర్భంలో వచ్చే ఈ పాట ఆద్యంతం అలరించింది. నవ్వులు పూయించింది. సినిమాకది మంచి ప్లస్‌ అయ్యింది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంలో ఈ పాట పాత్ర కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా సమంత, ప్రణీత నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

అంతకు ముందు `పంజా` సినిమాలోనూ పాట పాడారు పవన్‌. `పాపా రాయుడు` అంటూ సాగే ఈ పాటని యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్‌ చేశారు. సీరియస్‌ టోన్‌లో సాగే ఈ పాట ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా సినిమా జనాలకు ఎక్కలేదు. గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసింది. ఈ చిత్రానికి విష్ణు వర్థన్‌ దర్శకత్వం వహించగా, ఇందులో సారా జానే డియాస్‌, అంజలి లావానియా హీరోయిన్లుగా నటించారు. అడవి శేష్‌ విలన్‌గా నటించాడు. ఈ మూవీ 2011 డిసెంబర్‌ 9న విడుదలైంది.

మరోవైపు `గుడుంబా శంకర్‌` చిత్రంలో `కిల్లి కిల్లి` అంటే సాగే పాటని పవన్‌ కళ్యాణ్‌ ఆలపించారు. సాంగ్‌ని మణిశర్మ కంపోజ్‌ చేశారు. వీర శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్‌ హీరోయిన్‌గా నటించింది. 2004లో `గుడుంబా శంకర్‌` విడుదలైంది. ఇందులో లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకున్నా, సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితే పవన్‌ పాడిన ఈ పాట మాత్రం యూత్‌ని బాగా అలరించింది. ఈ చిత్రానికి పవన్‌ అన్నయ్య నాగబాబు నిర్మాత కావడం గమనార్హం.

‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల విశ్లేషణ

పవన్‌ కళ్యాణ్‌ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `జానీ`. 2003లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో `నువ్వు సారా తాగుతా`, `రావోయి మా ఇంటికి` అనే రెండు పాటలను పవన్‌ కళ్యాణ్‌ ఆలపించారు. ఈ రెండు బిట్‌ సాంగ్స్ కి రమణ గోగుల సంగీతం అందించారు. అయితే ఈ చిత్రాన్ని పవన్‌ అన్నీ తానై రూపొందించారు. అన్నింటిలోనూ ఫ్రీడమ్‌ తీసుకున్నారు. పాటలు ఫర్వాలేదనిపించాయి. కానీ సినిమా ఆడలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

అయితే కెరీర్‌ ప్రారంభంలో మాత్రం పవన్‌కి పాటలు కలిసి వచ్చాయి. `తమ్ముడు` చిత్రంలో `తాటి చెట్టు`, `ఏం పిల్లా` అనే రెండు బిట్ సాంగ్స్ పాడారు. అవి ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లని బాగా అలరించాయి. సినిమా సక్సెస్‌లోనూ భాగమయ్యాయి. ఆ తర్వాత `ఖుషి`లో పాట పాడారు పవన్‌. `బయ్‌ బయ్యే బంగారు రమనమ్మా` అంటూ అలీతో కలిసి పాడే ఈ పాట విశేషంగా అలరించింది. అందరి చేత డాన్సులు వేయించింది. నవ్వులు పూయించింది. సినిమా కూడా పెద్ద హిట్‌ కావడంతో ఈపాట హైలైట్‌ అయ్యింది. ఇలా పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌ మొత్తంలో ఎనిమిది సార్లు పాట పాడితే `తమ్ముడు`, `ఖుషి`, `అత్తారింటికి దారేదీ` చిత్రాల విషయంలోనే వర్కౌట్ అయ్యింది. మిగిలిన ఐదు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఇప్పుడు `ఓజీ` విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన సినిమాలు వరుసగా డిజప్పాయింట్‌ చేస్తున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ని `ఓజీ` బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి.

చివరగా, పవన్ కళ్యాణ్ పాటలు పాడటం సినిమా ఫలితాలను ప్రభావితం చేస్తుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేము. సినిమా యొక్క మొత్తం కథ, నటన, దర్శకత్వం వంటి అనేక అంశాలు ఫలితాలను నిర్ణయిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.