
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల రామాయణం, దేశంలోని సామాజిక పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇటీవల నేను ఓ సాహితీ కార్యక్రమంలో తన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారన్నారు. తాను అవతారపురుషుడు శ్రీరాముడిని వెటకారం చేశానని, హిందూ ధర్మాన్ని గాయపరిచేలా మాట్లాడానని అంటున్నారు. అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. కానీ ధర్మాన్ని, మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వారిని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలాంటి వారు నన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ఏడ్పు నాకు అర్థం అవుతోందని అలాంటి వారికి సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తోట పనుల్లో ఉన్నాని ఆ పనులు అయ్యాక వస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కాగా సదరు కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చినవారని, దక్షిణాదిలో ఓ గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు తిన్నారని, ఆ విషయంపై వివాదం చెలరేగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్రాజ్కు పరువు నష్టం నోటీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యలను వక్రీరకిస్తున్నారంటూ ఇచ్చిన వివరణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అనేది వేచి చూడాలి.


