
📌 Key Points
- పాక్ వైమానిక దాడిలో 400 మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి, 250 మందికి గాయాలు.
- డ్రగ్స్ కు బానిసలైన వారికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రిపై పాక్ దాడి.
- సాధారణ పౌరుల మృతిపై రషీద్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి, ఐక్యరాజ్యసమితికి విన్నపం.
- దాడిని ‘యుద్ధ నేరం’గా పేర్కొన్న రషీద్ ఖాన్, విచారణకు డిమాండ్.
పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక ఆసుపత్రిపై దాడి చేయడంతో 400 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇది యుద్ధ నేరమని ఆయన ఖండించారు.
పాక్ వైమానిక దాడి: 400 మంది మృతి
గత కొన్ని నెలలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానికదళం.. ఆఫ్ఘనిస్తాన్ లోకి ఓ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 400 మంది మృతి చెందగా మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ దాడిలో మరణించిన వారంతా.. డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో వారికి చికిత్స అందించేందుకు స్థానిక ప్రభుత్వం ఈ ఆస్పత్రిని నిర్వహిస్తుంది. కాగా పాక్ చేసిన ఈ పైశాచిక దాడిపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటరల్ అయిన రషిద్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన పాక్ పై ఫైర్ అయ్యాడు.
రషీద్ ఖాన్ ఫైర్: యుద్ధ నేరంగా అభివర్ణన
అర్ధరాత్రి పాకిస్తాన్ చేసి వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రషీద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. పౌరుల ఇళ్లు, విద్యా సంస్థలు, దా వైద్య మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అది ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా పొరపాటున జరిగినా ఖచ్చితంగా అది ‘యుద్ధ నేరం’ (War Crime) కిందకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
ఐక్యరాజ్యసమితికి రషీద్ ఖాన్ విజ్ఞప్తి
ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో మానవ ప్రాణాల పట్ల కనీస గౌరవం లేకుండా ఇలాంటి దాడులకు పాల్పడటం విచారకరమని, ఇది ప్రజల మధ్య విద్వేషాలను మాత్రమే పెంచుతుందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘోర కలికంపై ఐక్యరాజ్యసమితి (UN), ఇతర మానవ హక్కుల సంస్థలు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రషీద్ ఖాన్ డిమాండ్ చేశాడు. అలాగే ఈ కష్టకాలంలో తన దేశ ప్రజలకు అండగా ఉంటానని, ఒక జాతిగా తాము మళ్ళీ పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ రషీద్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జోక్యం కోరారు. ఈ దాడుల బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


