
ప్రముఖ సీనియర్ నటి బి. సరోజా దేవి తన 87వ ఏట మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆమె మరణం సినీ ప్రియులను కలచివేసింది.
Key Points
ప్రముఖ నటి బి. సరోజా దేవి మృతి.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తో క్లాసిక్ చిత్రాల్లో నటించారు.
పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత.
సీనియర్ నటి సరోజా దేవి మృతి
కోట శ్రీనివాసరావు మరణాన్ని మరిచిపోక ముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి బి సరోజా దేవి (87) తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని తన నివాసంలో ఆమె సోమవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆమె మరణానికి వృద్ధాప్యంలో అనారోగ్యమే కారణమని తెలుస్తోంది. సరోజ దేవి మృతితో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
బి సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా నటించారు. సరోజ దేవి 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కొన్ని వందల చిత్రాల్లో దక్షిణాది భాషల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి తెలుగు హీరోలతో ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తో సినిమాలు
1957లో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రంతో సరోజాదేవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత భూకైలాష్, సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దానవీరశూరకర్ణ, పండంటి కాపురం, ఇంటికి దీపం ఇల్లాలే, అమరశిల్పి జక్కన్న, దాగుడుమూతలు ఇలా ఎన్నో చిత్రాల్లో సరోజ దేవి నటించారు.
అవార్డులు మరియు గుర్తింపు
సరోజ దేవి 1942లో కర్ణాటకలో జన్మించారు. 1967లో సరోజ దేవి శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకోగా ఆయన అనారోగ్యంతో 1986లో మరణించారు. సరోజ దేవి ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. భారత ప్రభుత్వం సరోజా దేవికి 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులను అందించింది. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు.
తెలుగు సినిమా రంగం సరోజా దేవి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె అద్భుతమైన నటనకు, అవార్డులకు చిరస్థాయి గుర్తుగా నిలిచిపోతుంది.


