
📌 Key Points
- నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై ఏసీబీ కేసు నమోదు.
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రూ. 3 కోట్ల అక్రమాస్తులు ప్రాథమికంగా గుర్తింపు.
- మల్లారెడ్డి నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో విస్తృత సోదాలు.
- మూడు బ్యాంకు లాకర్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం.
తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించి, పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
ఏసీబీ వలలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
Mallareddy Disproportionate Assets Case : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి వణుకు పుట్టించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్న జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఒకేసారి ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించింది. ఈ సోదాల్లో విస్తుపోయేలా మల్లారెడ్డి సంపాదించిన భారీ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు
వీటితో పాటు నిందితుడైన ఎక్సైజ్ అధికారి భార్య, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ లాకర్లను త్వరలోనే తెరిచి సోదాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే తనిఖీల్లో ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం జరిపిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. అయితే….. బహిరంగ మార్కెట్లో ఈ స్థిరాస్తుల విలువ (మార్కెట్ వాల్యూ) రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
బ్యాంకు లాకర్లు, వాహనాలు స్వాధీనం
మల్లారెడ్డికి సంబంధించి మరికొన్ని అదనపు ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని,.. వాటికి సంబంధించిన మరింత సమాచారం మరియు ధృవీకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఏసీబీ తెలిపింది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని… పట్టుబడిన ఎక్సైజ్ అధికారి కె. మల్లారెడ్డిని హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మల్లారెడ్డిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అవినీతికి పాల్పడే అధికారులకు ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

