
📌 Key Points
- రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఉత్తరాంధ్రలో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.
- నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- తెలంగాణలో గురువారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాయలసీమలో వర్షాలు, ఉత్తరాంధ్రలో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాయలసీమలో వర్షాలు, పిడుగుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని తెలిపింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ,రేపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఇవాళ(మార్చి 30) విజయనగరం జిల్లాలోని బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలకు వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం, అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉంది.
ఉత్తరాంధ్రలో వడగాలులు, ప్రజలకు సూచనలు
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరులో 42.4 డిగ్రీలు, మార్కాపురం జిల్లాలోని నందనమారెల్ల వద్ద 42.3 డిగ్రీలు, కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నాగలాపురం (తిరుపతి), సింధురాజపురం (చిత్తూరు), రాజం (విజయనగరం), నుజెండ్ల (పల్నాడు), కొండపి (ప్రకాశం), నంద్యాల వంటి ఇతర ప్రదేశాలలో 40.8 నుంచి 41.7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా…. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లకపోవటం మంచిదని పేర్కొంటున్నారు. తగినంత మంచి నీళ్లను తీసుకోవాలని… టోపీ, కాళ్లజోడు వంటివి వాడాలని సూచిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే గురువారం వరకు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణలో భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక
మరోవైపు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో సహా మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉండగా… మిగిలిన జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


