
📌 Key Points
- మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది.
- నియోజకవర్గాల పునర్విభజనకు ముందే అమలు చేయాలని యోచనలో ఉంది.
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు.
- రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యేలోపే ఈ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కేంద్రం కీలక నిర్ణయం: పునర్విభజనకు ముందే అమలు?
మహిళా రిజర్వేషన్ల చట్టం (Women’s Reservation ACT) పై కేంద్ర కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు మందే ఈ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని సవరించి ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వర్గాలు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023లో ఆమోదం పొందింది. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందంగా ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదించారు. వాస్తవానికి జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే అమలు చేస్తామని మహిళా రిజర్వేషన్ బిల్లులోని నిబంధనలు చెబుతున్నాయి. జనగణన ఆలస్యం కావడం, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యంతో 2029 లోక్సభ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అంచనా వేశారు. కానీ అప్పటి జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే మరో రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలపై ప్రభావం: సీట్ల సంఖ్యలో మార్పులు
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అసెంబ్లీ, లోక్ సభలో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉండగా వీటిలో సుమారు 40 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే లోక్ సభకు 17 స్థానాలు ఉంటే సుమారు 5-6 సీట్లు మహిళాలకు దక్కనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 175 శాసనసభ స్థానాలు ఉంటే ఇందులో మహిళలకు సుమారు 57-58 సీట్లు, 25 లోక్ సభ స్థానాల్లో 8 మహిళలకు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఇలా జరిగితే మహిళల ప్రాతినిథ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.
మొత్తానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం రాజకీయంగా ఒక పెద్ద మార్పుకు సంకేతం. దీని ఫలితంగా మహిళా ప్రాతినిథ్యం పెరగనుంది.


