
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు పాల్గొన్నారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ పడుతున్న నష్టాలపై చిరంజీవి, దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
Key Points
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు పైరసీపై మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
పైరసీ వల్ల వేల కుటుంబాలు నష్టపోతున్నాయని, పరిశ్రమకు పెద్ద సవాల్ అని చిరంజీవి అన్నారు.
పైరసీ సైట్లతో డేటా చోరీ ప్రమాదం, నెలలోపే OTTలో సినిమాలు చూడాలని దిల్ రాజు సూచించారు.
ఇమ్మడి రవి అరెస్టు.. మీడియా సమావేశం
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహుకుడు ఇమ్మడి రవి అరెస్ట్పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
పైరసీపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన ఛాలెంజ్ను స్వీకరించిన తెలంగాణ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్గా మారిందని ఇలా చెప్పారు. ‘సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సీపీ సీవీ ఆనంద్తో పాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు.’ అని చిరు అన్నారు.
దిల్ రాజు సూచనలు.. పోలీసులకు ధన్యవాదాలు
సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ ఇలా పేర్కొన్నారు. ‘మూడు నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్లు మొదలయ్యాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరి అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెలరోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్సైట్స్లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి.’ అంటూ దిల్ రాజు తెలిపారు.
పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించవద్దని సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఇవి పరిశ్రమకు, వ్యక్తిగత డేటాకు ప్రమాదకరమని హెచ్చరించారు. నెలలోపే ఓటీటీలో సినిమాలు వస్తున్నందున, పైరసీని విడిచి, పరిశ్రమను ఆదరించాలని కోరారు.


