
📌 Key Points
- ఛోటా కె నాయుడు ‘అంజి’ సినిమాకి గర్వంగా పనిచేశానని, ‘విశ్వంభర’కు తలదించుకుని పనిచేస్తున్నానని అన్నారు.
- గ్రాఫిక్స్ సినిమాల్లో కెమెరామెన్ల పాత్ర తగ్గిందని, సీజీ మరియు దర్శకుల సూచనల ప్రకారమే పనిచేయాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
- సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్స్కు కెమెరామెన్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఛోటా కె నాయుడు తెలిపారు.
- సీజీ నిపుణులు అడిగిన విధంగానే లైటింగ్ మరియు ఇతర విషయాల్లో పనిచేయాల్సి వస్తోందని ఆయన వివరించారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అంజి’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు పనిచేయడం తనకెలా ఉందో ఆయన తెలిపారు.
ఛోటా కె నాయుడు సంచలన వ్యాఖ్యలు
Chota K Naidu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5 సినిమాటోగ్రాఫర్స్లో ఛోటా కె నాయుడు (Chota K Naidu) ఒకరు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు, లయ హీరోహీరోయిన్లుగా.. హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వదలా’ (Vadalaa). చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ని బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఛోటా కె నాయుడు ‘అంజి’ (Anji Movie) సినిమాకు తలెత్తుకొని పని చేస్తే.. ‘విశ్వంభర’ (Vishwambhara)కు తలదించుకుని పని చేస్తున్నా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఈ కార్యక్రమంలో ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. ‘‘గ్రాఫిక్స్కు సంబంధించిన సినిమాల్లో కెమెరామ్యాన్లు మైండ్ వాడటం మానేశాం. సీజీ, దర్శకులు ఏం కోరుకుంటున్నారో, వాళ్ల మైండ్ సెట్ ప్రకారమే అంతా చేస్తున్నాం. ఈ విషయంలో క్వాలిటీ సరిగా రాలేదని సినిమాటోగ్రాఫర్పై నిందలు వేయడం కరెక్ట్ కాదు. సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పరవాలేదు.. సీజీ వాళ్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడొచ్చే సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్స్కి కెమెరామ్యాన్తో ఎటువంటి సంబంధం లేదు. వాళ్లకి ఏం కావాలో అది అడిగి, వాళ్ల అనుమతితోనే చేస్తున్నామంతా. నేను కూడా అదే చేస్తున్నాను. నేను పెద్ద పుడింగిని.. ‘అంజి’ చేశాను, అది చేశాను, ఇది చేశాను, నంది అవార్డు వచ్చింది, ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిందని చెప్పడం లేదు. కెమెరామ్యాన్ నేను అయినా, సీజీకి సంబంధించిన అతనికి అనుభవం ఉన్నా, లేకపోయినా.. అతను ఏది అడిగితే అది మా ఈగోస్ని పక్కన పెట్టి తీసి ఇవ్వడమే.
గ్రాఫిక్స్ సినిమాల్లో కెమెరామెన్ పాత్రపై విశ్లేషణ
వాళ్లు లైట్ ఇక్కడ పెట్టి తీయమంటారు.. నాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. అయినా సరే, రేపు క్వాలిటీ బాగోపోతే, కెమెరామ్యాన్ కోపరేట్ చేయలేదని అతను వెళ్లి ఇంకొకరితో చెబితే, ఆ ప్రాజెక్ట్కి, కెమెరామ్యాన్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే వాళ్లకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే వాడి కర్మ.. మా తప్పయితే ఏం లేదు. అవుట్ ఫుట్ బాగా వస్తే క్రెడిట్ మొత్తం వాళ్లకి, బ్యాడ్ వస్తే మాత్రం కెమెరామ్యాన్ది అంటారు. ఇది ఇండస్ట్రీలో 100 శాతం జరుగుతుంది. ప్రేక్షకులు, మీడియా ఎవరూ దీని గురించి మాట్లాడుకోరు. ప్రాజెక్ట్ని ఎవరైతే చెడగొడతారో.. వాళ్లే వెనకుండి కెమెరామ్యాన్పై లేనిపోనివి మాట్లాడుతుంటారు. ఇప్పుడు కొత్తగా సీజీ కోసమని ఒక టెక్నిషియన్ కూడా వచ్చాడు. అతను కెమెరామ్యాన్ వెంటే ఉంటాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. అతని నాలెడ్జ్ లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేము తీయం.. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మేము తీయకూడదు కూడా.
సినిమా సక్సెస్లో కెమెరామెన్ పాత్ర ఎంత?
నేనయితే సీజీ పర్సన్ లేకుండా కెమెరా ఆన్ చేయడం లేదు. సెట్కి వెళ్లగానే అతను వచ్చాడా? అని అడిగి, అతను ఉంటేనే పని చేస్తున్నాం. ‘అంజి’ సినిమాకు తలెత్తుకుని పని చేశాం.. ‘విశ్వంభర’కు తలదించుకుని పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ‘విశ్వంభర’ అనేది సీజీలో పీక్. అక్కడికి పోయి నేను ఛోటా కె నాయుడు అంటే దొబ్బదు. వాళ్లకి బాగుండాలి.. ఎందుకంటే ఆ సినిమాకు రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అక్కడికిపోయి నా ఈగో చూపిస్తే వర్కవుట్ అవ్వదు. అందుకే ఆ సినిమా చాలా టైమ్ తీసుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ది బెస్ట్ అవుట్పుట్తో ఆ సినిమా వస్తుంది’’ అని ఛోటా కె నాయుడు చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఛోటా కె నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. గ్రాఫిక్స్ హవా పెరిగిన తర్వాత సినిమాటోగ్రాఫర్ల పాత్ర తగ్గిందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.


