|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లంబోర్గిని వీరంగం: రోడ్డుపై డేంజరస్ స్టంట్స్, సీజ్ చేసిన పోలీసులు!

Published: 22-03-2026, 11:35 AM
లంబోర్గిని వీరంగం: రోడ్డుపై డేంజరస్ స్టంట్స్, సీజ్ చేసిన పోలీసులు!
  • బెంగళూరులో లంబోర్గిని కారుతో డేంజరస్ స్టంట్స్ చేసిన వీడియో వైరల్
  • ముత్తప్ప రాయ్ కుమారుడు రికీ రాయ్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు
  • సదాశివనగర్‌లోని రికీ రాయ్ నివాసంలో లగ్జరీ కారును సీజ్ చేసిన పోలీసులు
  • కారు యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు

బెంగళూరు నగరంలో ఓ లంబోర్గిని కారుతో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తూ హల్ చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కారును సీజ్ చేసి యజమానికి సమన్లు జారీ చేశారు.

లంబోర్గిని కారుతో ప్రమాదకర విన్యాసాలు

నగరం నడిబొడ్డున ఉన్న అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద తెల్లవారుజామున ఓ ఖరీదైన లంబోర్గిని కారుతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్స్) చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దివంగత, మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముత్తప్ప రాయ్ కుమారుడు రికీ రాయ్‌కు పోలీసులు సమన్లు జారీ చేశారు. సదాశివనగర్‌లోని రికీ రాయ్ నివాసంలో ఉన్న ఈ లగ్జరీ కారును గుర్తించిన పోలీసులు దానిని సీజ్ చేశారు.

శనివారం (మార్చి 21, 2026) తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద తెల్ల రంగు లంబోర్గిని కారు (రిజిస్ట్రేషన్ నంబర్: KA 05 NR 0009) అత్యంత ప్రమాదకర రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంక్షన్ వద్ద ఈ కారు రెండు సార్లు గుండ్రంగా తిరిగి, ఆపై టానిక్ సర్కిల్ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత యూ-టర్న్ తీసుకుని ట్రినిటీ జంక్షన్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ మార్గంలో వెళ్లిపోయింది. ఈ సమయంలో కారులోని వారు సన్‌రూఫ్‌లో నుంచి బయటకు వచ్చి అరుస్తూ నానా హంగామా సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడున్న వారు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రికార్డు అయిన వీడియో, స్పందించిన పోలీసులు

ఈ ఘటనపై కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు సుమోటోగా స్పందించి, కారు యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ‘ప్రజా రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలను నడపడాన్ని ఉపేక్షించేది లేదు. అతివేగంగా, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా డ్రైవింగ్ చేసినందుకు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం’ అని ఒక సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి స్పష్టం చేశారు. డిజిటల్ ఆధారాలు, రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తు ముమ్మరం.. డ్రైవింగ్ చేసింది ఎవరో?

ముమ్మర దర్యాప్తు, కారు సీజ్

కారును రికీ రాయ్ నివాసం నుంచి సీజ్ చేసినప్పటికీ.. ఈ కారు అసలు యజమాని ఎవరు? ఆ సమయంలో కారును నడిపింది రికీ రాయేనా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నిర్ధారణ కావడంతో, ఆర్టీఏ (RTO) అధికారుల ద్వారా వాహన యజమాని పూర్తి వివరాలు, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ ఎవరు చేశారో గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు.

ప్రజా రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.