
ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇడ్లీ కొట్టు’ మూవీ తొలి రోజు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. నెగటివ్ టాక్, తగినంత పబ్లిసిటీ లేకపోవడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ధనుష్ గత చిత్రం ‘కుబేర’ కంటే చాలా తక్కువ కలెక్షన్స్ తో వెనకబడింది.
Key Points
ధనుష్ 'ఇడ్లీ కొట్టు' తొలి రోజు ఇండియాలో రూ.10.40 కోట్లు వసూలు చేసింది.
తెలుగు వెర్షన్ కేవలం రూ.65 లక్షలు మాత్రమే రాబట్టి, దారుణమైన ఓపెనింగ్స్ ని నమోదు చేసింది.
సినిమాకు ప్రారంభం నుంచే నెగటివ్ టాక్, పబ్లిసిటీ లేకపోవడం వసూళ్లపై ప్రభావం చూపింది.
ధనుష్ గత చిత్రం 'కుబేర' తొలి రోజు రూ.15 కోట్లతో పోలిస్తే, 'ఇడ్లీ కొట్టు' సగం కూడా రాలేకపోయింది.
ఇడ్లీ కొట్టు: తొలి రోజు బాక్సాఫీసు వసూళ్ల వివరాలు
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ `ఇడ్లీ కొట్టు`. తమిళంలో వచ్చిన `ఇడ్లీ కడై` మూవీకిది తెలుగు అనువాదం. ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, అరుణ్ విజయ్, సముద్రఖని, పార్థిబన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వండర్ బార్ పిక్చర్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దసరా పండుగని పురస్కరించుకుని బుధవారం ఈ చిత్రం విడుదలయ్యింది.
`రాయన్` చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన మూవీ `ఇడ్లీ కొట్టు`. `రాయన్` పెద్దగా ఆడకపోయినా మొదటి మంచి వసూళ్లని రాబట్టింది. కానీ `ఇడ్లీ కొట్టు` వెనకబడిపోయింది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. స్లోగా సాగడం, కథలో డ్రామా పండకపోవడం, ఎమోషన్స్ బలంగా పండకపోవడంతో ఆడియెన్స్ కి ఎక్కలేదు. చాలా వరకు ఇది ఓటీటీ మూవీ అనే కామెంట్ వచ్చింది. పైగా పబ్లిసిటీ కూడా చేయలేదు. సినిమా వస్తుందనే విషయమే తెలియదు. దీంతో ఆ ప్రభావం సినిమాపై పడింది. అది ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం చూపించింది.
నెగటివ్ టాక్, పబ్లిసిటీ లోపం ప్రభావం
ఈ నేపథ్యంలో `ఇడ్లీ కొట్టు` సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలు బయటకొచ్చాయి. దీని ప్రకారం, భారతదేశంలో మొదటి రోజు రూ.10.40 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ.9.75 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.65 లక్షలు రాబట్టింది. తెలుగులో మరీ దారుణమైన ఓపెనింగ్స్ ని రాబట్టడం గమనార్హం. ఇక ఓవర్సీస్లో కోటి వరకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.12 కోట్ల గ్రాస్ (ఆరు కోట్ల షేర్) వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్.
ధనుష్ ‘కుబేర’తో పోలిక: వసూళ్ల అంతరం
ధనుష్ చివరిగా `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ము దర్శకత్వం వహించారు. నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలో సుమారు రూ.15కోట్లు చేసింది. తెలుగులోనే పది కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.27కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు `ఇడ్లీకొట్టు`కి అందులో సగం కూడా రాలేకపోవడం గమనార్హం.
మొత్తంగా, ‘ఇడ్లీ కొట్టు’ తొలి రోజు వసూళ్లు ధనుష్ స్టార్డమ్కు దూరంగా నిలిచాయి. నెగటివ్ టాక్, ప్రచారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. ఈ ఫలితం చిత్ర బృందానికి, అభిమానులకు నిరాశ కలిగించేదే.


