
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి.. ఆదివారం హైదరాబాద్లోని దసవల్లా హోటల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (SIFPA) పేరుతో ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. థియేట్రికల్ నిబంధనలు, 8 వారాల ఓటీటీ విడుదల గడువు వంటి కీలక అంశాలపై పరిశ్రమలోని ఇతర వర్గాలు తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా నర్ణయాలు తీసుకోవడాన్ని ఖండిస్తూ ‘సిఫ్పా’ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినిమా నిర్మాణ వ్యవస్థను ఒక్కసారిగా మార్చడం సాధ్యం కాదని తెలిపారు. అలాగే ప్రస్తుతం అనుసరిస్తున్న నిర్మాణ ప్రక్రియలు, హక్కుల విక్రయాలు, విడుదల ప్రణాళికలను యథాతథంగా కొనసాగించాలని, ముఖ్యంగా ఓటీటీ విడుదల గడువుకు సంబంధించి ఏ సంఘానికి గానీ, రంగానికి గానీ ఎలాంటి హామ పత్రాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

