
తాజాగా విడుదలైన మలయాళ సూపర్ హీరో సినిమా ‘లోకా’ విజయంపై దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకే జానర్పై అధిక దృష్టి సారించకూడదని ఆయన హెచ్చరించారు.
Key Points
లోకా సినిమా సూపర్ హిట్ అవడంతో సూపర్ హీరో సినిమాలపై దృష్టి పెడుతున్న నిర్మాతలను జీతూ జోసెఫ్ హెచ్చరించారు.
వివిధ జానర్ల సినిమాలు ఉత్పత్తి అవడం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
లోకా సినిమాలో లింగభేదం ఆధారంగా వర్గీకరించడం సరికాదని జీతూ అన్నారు.
జీతూ జోసెఫ్ త్వరలో పిల్లల సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు.
జీతూ జోసెఫ్ యొక్క లోకా సినిమాపై అభిప్రాయాలు
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి ఫిమేల్ సూపర్ హీరో సినిమా లోకా: ఛాప్టర్ 1 చంద్ర. ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఒక ఈవెంట్లో మాట్లాడాడు. అతడు త్వరలో రాబోతున్న తన సినిమా ‘మిరాజ్’ ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ.. లోకా సక్సెస్ తర్వాత అందరు ఫిల్మ్ మేకర్స్ ఇక సూపర్ హీరో సినిమాల మీద పడొద్దని వార్నింగ్ ఇచ్చాడు.
ఒక నిర్దిష్ట జానర్లోని సినిమా హిట్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఆ ట్రెండ్ను ఉపయోగించుకోవడానికి చూస్తారని జీతూ జోసెఫ్ అభిప్రాయపడ్డాడు. అయితే సినిమా ఇండస్ట్రీ వైవిధ్యం ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అతడు స్పష్టం చేశాడు. “ఒక ఇండస్ట్రీలో వివిధ జానర్ల నుంచి సినిమాలు ఉండాలి. సాధారణంగా జరిగేది ఏమిటంటే ఒక జానర్లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే అందరూ అదే సినిమా చేయడానికి వెళ్తారు. లోకా సక్సెస్తో ఇప్పుడు అందరూ సూపర్ హీరో సినిమాలు చేయడం మొదలుపెడతారు. అది సరైన పని కాదు” అని అతడు అన్నాడు.
సినిమా పరిశ్రమలో జానర్ల వైవిధ్యం
లోకా ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి సవాలు ఏమిటంటే ఇతర జానర్లతో ఎక్స్పెరిమెంట్ చేసి వాటిని కూడా సక్సెస్ చేయడం అని జీతూ చెప్పాడు. లోకా లాంటి సినిమాలను ఫిమేల్ లీడ్గా చెప్పడాన్ని కొట్టిపారేశాడు. “సినిమాలో అలాంటి వర్గీకరణ ఉండకూడదు. ఒక యాక్టర్ మగ లేదా ఆడ ఒక పాత్రను బాగా చేస్తే ఆడియన్స్కి కనెక్ట్ అయితే అది సక్సెస్ అవుతుంది. ఇది ఇంతకుముందు నిరూపితమైంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. భవిష్యత్తులో కూడా జరుగుతుంది. లోకాలో కూడా అదే జరిగింది” అని వివరించాడు.
లోకా ఛాప్టర్ 1 చంద్ర మూవీని డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో దుల్కర్ వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్ని మొదలుపెట్టాలనుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి.. లోకా ఈ ఏడాది మూడో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది.
భవిష్యత్తులో జీతూ జోసెఫ్ సినిమాలు
‘దృశ్యం’ సక్సెస్ నుండి తాను వరుసగా థ్రిల్లర్స్ చేస్తున్నానని జీతూ చెప్పాడు. ఎందుకంటే ప్రేక్షకులు తన నుంచి అవే ఆశిస్తున్నారని అన్నాడు. అయితే తాను ఏదో ఒక రోజు పిల్లల సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. “కానీ నాకు అన్ని రకాల సినిమాలు చేయడం చాలా ఇష్టం. నేను ఇప్పుడు పని చేస్తున్న సబ్జెక్టులలో ఒకటి పిల్లల సినిమా. బహుశా రెండు మూడు సంవత్సరాలలో అలాంటి సినిమాలు వస్తాయి” అని అతడు అన్నాడు. తాను మల్టీ-హీరో సినిమాను కూడా డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పాడు.
జీతూ ‘మిరాజ్’ మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల అవుతుంది. అతడు ‘వలాతు వాషాతే కల్లన్’ తో పాటు ‘దృశ్యం 3’, మోహన్లాల్తో ‘రామ్: పార్ట్ 1’ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
చివరగా, జీతూ జోసెఫ్ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో వైవిధ్యాన్ని ప్రోత్సహించే అవసరాన్ని నొక్కి చెప్పాయి. విజయవంతమైన జానర్ను అనుసరించడం కంటే విభిన్న ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.


