
📌 Key Points
- దివ్యాంగులైన ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించేందుకు విద్యా శాఖ ప్రతిపాదన.
- మొదట 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,000 మంది విద్యార్థులకు ప్రయోజనం.
- 10వ తరగతి మార్కుల ఆధారంగా బాలికలకు రూ.2,500 స్కాలర్షిప్లు.
- హైదరాబాద్లో దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదన.
ఈ విద్యా సంవత్సరం నుండి దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించాలని విద్యా శాఖ నిర్ణయించింది. అంతేకాకుండా, బాలికలకు 10వ తరగతి మార్కుల ఆధారంగా స్కాలర్షిప్లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ పథకం
ఈ విద్యా సంవత్సరం నుండి ప్రోత్సాహకంగా దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులైన విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
మారుమూల ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు కాలేజీలకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. దివ్యాంగులైన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తే ఎంతగానో వారికి ఉపయోగకరంగా ఉంటుందని డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. ఈ స్కూటర్లు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి సహాయపడతాయి. రోజువారీ ప్రయాణ కష్టాలను తగ్గిస్తాయన్నారు.
బాలికలకు స్కాలర్షిప్లు: విద్యాశాఖ ప్రకటన
ముందుగా ఈ పథకానికి ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరారు అధికారులు. తరువాత ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత కార్యాక్రమం ట్రాన్స్జెండర్ విద్యార్థులకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు విద్యార్థులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారు. నడవడానికి ఇబ్బందిపడుతున్నవారికి ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రోజూ కాలేజీకి వెళ్లేందుకు చాలా సహాయంగా ఉంటుందని అంటున్నారు.
హైదరాబాద్లో ప్రత్యేక జూనియర్ కళాశాలల ఏర్పాటు
మరోవైపు హైదరాబాద్ లో దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదించింది. జూనియర్ కళాశాలల్లోని బాలికల కోసం కొత్త స్కాలర్షిప్ పథకాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10వ తరగతి మార్కుల ఆధారంగా దాదాపు 40,000 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2,500 స్కాలర్షిప్లు అందుకుంటారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్కాలర్షిప్లు అనే కార్యక్రమాలు యాక్సెస్ను మెరుగుపరచడం, విద్యార్థులకు ఆర్థిక అడ్డంకులను తగ్గిస్తాయని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు కాలేజీలకు రెగ్యూలర్గా వచ్చేందుకు ఈ కొత్త ప్రతిపాదనలు ఉపయోగపడతాయని అనుకుంటున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్కాలర్షిప్ల ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకాల ద్వారా విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలలకు వస్తారని ఆశిస్తున్నారు.


