
టాలీవుడ్లో విజయశాంతికి మేకప్ మాన్ గా పనిచేసిన ఏఎం రత్నం, ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. కర్తవ్యం చిత్రం ద్వారా నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఆయన, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో సంచలనం సృష్టించారు.
Key Points
విజయశాంతికి మేకప్ మాన్ గా పనిచేసిన ఏఎం రత్నం ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్.
కర్తవ్యం చిత్రం ద్వారా నిర్మాతగా ఎదిగారు.
ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
200 కోట్ల బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించారు.
మేకప్ మాన్ నుండి స్టార్ ప్రొడ్యూసర్ వరకు
టాలీవుడ్ లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు. కర్తవ్యం చిత్రంతో విజయశాంతికి టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ వచ్చింది. ఈ మూవీ తో విజయశాంతి స్టార్ హీరోలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. ఈ చిత్రం తర్వాత ఆమెని అంతా లేడీ అమితాబ్ అని పిలవడం ప్రారంభించారు.
విజయశాంతికి మేకప్ మెన్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని తెలుసా? కానీ ఇది నిజం.. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఆయన తన కెరీర్ ని మేకప్ మెన్ గా ప్రారంభించారు. ఏఎం రత్నం విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్ గా చాలా చిత్రాలకు పనిచేశారు.
కర్తవ్యం చిత్రం – ఒక మలుపు
విజయశాంతితో ఉన్న పరిచయంతో కర్తవ్యం కథ సిద్ధం చేసి ఆ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. కర్తవ్యం మూవీ సంచలనం విజయం సాధించింది. ఆ తర్వాత ఏం రత్నం అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో తిరుగులేని నిర్మాతగా అవతరించాడు. ఒకే ఒక్కడు, భారతీయుడు, ఖుషి, స్నేహం కోసం, బాయ్స్, 7G బృందావన కాలనీ లాంటి విజయవంతమైన చిత్రాలని ఏఎం రత్నం నిర్మించారు. కర్తవ్యం చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయినప్పుడు కొన్ని వేలమంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారట. కర్తవ్యం చిత్రంతో తనకి దక్కిన సంతృప్తి అది అని ఏఎం రత్నం తెలిపారు.
తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 200 కోట్ల భారీ బడ్జెట్ లో హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధికంగా 48 మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ సాధించింది.
200 కోట్ల హరిహర వీరమల్లు
ఈ చిత్రాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. ముందుగా ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైంది. కొంత భాగం షూటింగ్ జరిగాక ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నారు.
ఏఎం రత్నం సినీ ప్రయాణం ఒక గొప్ప విజయగాథ. మేకప్ మాన్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, 200 కోట్ల బడ్జెట్ చిత్రాల నిర్మాణంతో ముగిసింది. ఆయన భవిష్యత్తు చిత్రాలు మరిన్ని విజయాలను అందించాలని ఆశిద్దాం.


