
ఈ మధ్యకాలంలో ఓ సినిమా ప్రకటించిన వెంటనే వరుసగా అప్డేట్లు వస్తుండటం సాధారణమైపోయింది. పూజా కార్యక్రమం, షూటింగ్ అప్డేట్లు, ఫస్ట్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్ వరకు సినిమా విడుదలకు ముందే భారీ ప్రచారం నిర్వహిస్తూ మేకర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు. అయితే ఓ క్రేజీ దర్శకుడు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా, ఒక్క అధికారిక అప్డేట్ కూడా ఇవ్వకుండా సినిమా షూటింగ్ను పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు క్రిష్ జాగర్లమూడి. ‘గమ్యం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన క్రిష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే గత కొంతకాలంగా ఆయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే క్రిష్ కొంతకాలం క్రితమే ఎలాంటి ప్రకటన లేకుండా ఓ కొత్త సినిమాను ప్రారంభించి, ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ప్రచార హడావుడి లేకుండానే సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన క్రిష్ పని తీరు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.