
📌 Key Points
- కడప జిల్లాలో భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీసిన భర్త శ్రీనివాస్.
- భార్యకు ఉరి వేసుకోవడంలో సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన భర్త.
- మద్యం అలవాటుతో గొడవలు, ఆత్మహత్యాయత్నం చేస్తున్న భార్యను పట్టించుకోని భర్త.
- పోలీసుల అదుపులో శ్రీనివాస్, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
కడప జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కళ్లెదుటే వీడియో తీశాడు భర్త. అంతేకాదు, ఆమెకు సలహాలు కూడా ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
భార్య ఆత్మహత్యాయత్నం, వీడియో తీసిన భర్త
భర్త కళ్లెదుటే భార్య ఉరివేసుకుంది. అయితే కాపాడాల్సిన భర్త ఈ ఘటనను వీడియో తీశాడు. అంతేకాకుండా ఉరివేసుకుంటుండగా సలహాలు ఇచ్చాడు. నవ్వుతూ ఉన్నాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
కడప జిల్లా రాజంపేటలో పోలీసులు శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఆమెను ఆపాల్సింది పోయి.. ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించినందుకు గాను పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజంపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లికి చెందిన లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాస్, తన భార్య కృష్ణవేణితో తరచుగా గొడవపడేవాడు. నిజానికి ఒంగోలుకు చెందిన శ్రీనివాస్ మెుదటి భార్య పది సంవత్సరాల కిందట చనిపోయింది. ఈ కారణంగా 2016లో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన భర్త
శ్రీనివాస్ మద్యం అలవాటు కారణంగా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో కృష్ణవేణి చనిపోతా అంటూ కొన్ని రోజులుగా అంటోంది. అయితే ఇటీవల గొడవలు మళ్లీ ఎక్కువ అయ్యాయి. తాజాగా చనిపోతానని ఇంట్లో గడియపెట్టుకుంది. భర్త శ్రీనివాస్ తలుపుల బయట ఉన్నాడు. ఈ సమయంలో కృష్ణవేణి ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తుంది. బయటే ఉన్న భర్త వీడియో తీశాడు. తన భార్య బెదిరిస్తుందని భావించాడు. కృష్ణా సరిగా ఉరెసుకో.. అలా కాదు.. ఇలా అంటూ సలహాలు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఆమె మెడకు ఉచ్చు బిగుసుకుంది. తలుపు తీసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించినా ఫలితం లేదు. అరుపులు విని పక్కవారు వచ్చారు. అప్పటికే కృష్ణవేణి చనిపోయింది. భార్య ఉరి వేసుకుంటుంటండగా భర్త వీడియో తీశాడు.
పోలీసుల అదుపులో శ్రీనివాస్
‘కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించడం మానేసి, ఆమె భర్త ఆ సంఘటన మొత్తాన్ని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.’ అని మన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగప్ప తెలిపారు.
ఘటనా స్థలానికి హుటాహుటిన కృష్ణవేణి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు శ్రీనివాస్పై దాడి చేసి, అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, శ్రీనివాస్ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


