
📌 Key Points
- హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం, పలువురి అరెస్ట్.
- ఫ్లాట్లు తక్కువ ధరలో ఇస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు.
- సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ప్రాజెక్ట్ కోసం రూ.77 లక్షలు వసూలు చేసిన వైనం.
- డబ్బులు చెల్లించినా ఫ్లాట్ ఇవ్వకపోవడంతో బాధితుల ఫిర్యాదు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. త్రిపుర కన్స్ట్రక్షన్స్ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పి కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో వెలుగు చూసిన రియల్ ఎస్టేట్ మోసం
హైదరాబాద్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ పేరుతో కొందరు కోట్లు దండుకున్నారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్ నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. కస్టమర్లను నమ్మించి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.
త్రిపుర కన్స్ట్రక్షన్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్తోపాటుగా ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్లాట్ల పేరుతో కోట్లు వసూలు చేసిన త్రిపుర కన్స్ట్రక్షన్స్
త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రారంభిస్తున్నట్టుగా ప్రచారం చేసిందని పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్శించడానికి అనేక రకాల ప్రకటనలు విడుదల చేశారు. తక్కువ ధరలో ఫ్లాట్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనలు నమ్మి.. చాలా మంది పెట్టుబడి పెట్టారు. కంపెనీ ముందుగానే భారీగా అడ్వాన్స్లు వసూలు చేసినట్టుగా బాధితులు పేర్కొన్నారు. ఇక టైమ్ దాటిపోయినా… ఫ్లాట్లు ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వమన్నా ఇవ్వకుండా దాటేశారు.
దీంతో బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లారు. కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. కానీ ఫ్లాట్ గానీ, డబ్బులు గానీ.. ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. భారీగా డబ్బులు సేకరించినట్టుగా గుర్తించారు. అయితే ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవ్వలేదు సరికదా.. మళ్లీ ఆకర్శించేందుకు ప్రచారం చేసినట్టుగా తెలిసింది. దీంతో ఈ కేసులో పసుపులేటి సుధాకర్తోపాటుగా ఆయన భార్య, మరికొందరిని అరెస్ట్ చేశారు.
డబ్బులు చెల్లించినా ఫ్లాట్లు ఇవ్వని వైనం, బాధితుల ఆవేదన
బాధితుల్లో ఒకరైన వినోద్ 2022 నవంబర్లో సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్లో త్రిపుర కన్స్ట్రక్షన్స్ ద్వారా భాగస్వామి పసుపులేటి సుగుణ, ఆమె భర్త, వ్యవస్థాపక ఛైర్మన్ పసుపులేటి సుధాకర్, శివ కృష్ణ, పల్లవి కృష్ణలతో కలిసి ప్రీ-లాంచ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలలోపు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వారి హామీలను నమ్మి, 2,200 చదరపు అడుగుల ఫ్లాట్ను రూ.77 లక్షలకు కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 2023లో ఒప్పందం కుదుర్చుకుని ఆ మొత్తాన్ని చెల్లించారు వినోద్.
అయితే, కంపెనీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు, అనుమతులు పొందలేదు. పదేపదే అభ్యర్థించినప్పటికీ ఫ్లాట్ కేటాయించడంలో లేదా డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైందని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఘటన రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలియజేస్తుంది. కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


