
ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్లో గల కోవో (Covo) పట్టణంలో ఇద్దరు భారతీయ పౌరులు కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వైశాఖి పండుగ వేడుకల కోసం స్థానిక గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీకి వెళ్లిన బాధితులు, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. మృతులను కోవో నివాసి రాజీందర్ సింగ్ (48), అగ్నాడెల్లోకు చెందిన గుర్మీత్ సింగ్ (48)గా గుర్తించారు.
ఈ ఘటన పారిశ్రామిక ప్రాంతంలోని గురుద్వారా ముందున్న చౌరస్తాలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయుడేనని, నిందితుడు కాల్పుల అనంతరం వాహనంలో పరారయ్యాడని స్థానిక మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న ట్రెవిగ్లియో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పండుగ పూట భక్తిశ్రద్ధలతో ప్రార్థనలకు వెళ్లి వస్తున్న క్రమంలో ఇలాంటి దాడి జరగడం స్థానిక భారతీయ సమాజంలో తీవ్ర విషాదాన్ని మరియు ఆందోళనను నింపింది.


