
📌 Key Points
- ప్రేమ జంటలకు రక్షణ కల్పించేందుకు కర్ణాటక సర్కార్ కొత్త చట్టం
- పెళ్లి చేసుకోవడానికి కుల పెద్దలు, తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు
- ప్రేమ జంటల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు
- కుల హత్యలకు పాల్పడితే కఠిన శిక్షలు విధింపు
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేమించుకున్న జంటలకు రక్షణ కల్పించేందుకు, పరువు హత్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం మేజర్లు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు.
ప్రేమ జంటలకు రక్షణ చట్టం
కర్ణాటక సర్కార్ (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రేమించుకున్న జంటలకు రక్షణ కల్పించేందుకు, పరువు హత్యల (Honor Killings)ను అరికట్టేందుకు చరిత్రలోనే విప్లవాత్మక అడుగు వేసింది. ‘కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, ఇద్దరు మేజర్లు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎవరూ అడ్డుకోలేరు. అయితే, వివాహం చేసుకునే ఇద్దరు వ్యక్తులు మేజర్లు యువతికి 18, యువకుడికి 21 ఏళ్లు ఉంటే.. వారి వివాహానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేదా కుల పెద్దల అనుమతి అవసరం లేదని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇద్దరి అంగీకారమే ఇక్కడ అత్యంత కీలకం కానుంది.
అనుమతులు అవసరం లేని వివాహాలు
తమ వివాహానికి కులం లేదా మతం పేరుతో ముప్పు పొంచి ఉందని భావించే జంటలు పోలీసులను ఆశ్రయించేలా బిల్లులో అంశాలను పొందుపరిచారు. ఫిర్యాదు అందిన కేవలం 6 గంటల్లోపు పోలీసులు స్పందించి వారికి తగిన రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ప్రేమ జంటల రక్షణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్స్, 24 గంటల హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహాని ఉన్న జంటల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సేఫ్ హౌస్ (Safe Houses)లను నిర్మించనుంది. పరువు పేరుతో దాడులకు పాల్పడినా, నవ దంపతులను సామాజికంగా బహిష్కరించినా దానిని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. కుల హత్యలకు పాల్పడితే కనిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేలా చట్టంలో పొందుపరిచారు.
కుల హత్యలపై కఠిన చర్యలు
ఈ బిల్లుకు 12వ శతాబ్దపు సామాజిక సంస్కర్త బసవన్న వచనం ‘ఇవా నమ్మవ’ (Ivaa Nammava) అంటే తెలుగులలో ‘అతడు మనవాడే’ అని పేరు పెట్టారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటాలనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా కుల హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కుల, మత భేదాలు లేకుండా ప్రేమించుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


