
📌 Key Points
- కర్ణాటక పవర్ షేరింగ్ వివాదం క్లైమాక్స్కు చేరింది.
- సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో అధిష్టానంతో భేటీ.
- డీకే శివకుమార్ సీఎం పదవికి పట్టుబడుతున్నారు.
- అధిష్టానం కొత్త ఫార్ములాతో నాయకత్వ మార్పునకు యత్నిస్తున్నట్లు ప్రచారం.
కర్ణాటకలో పవర్ షేరింగ్ డ్రామా కీలక దశకు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. సీఎం పీఠంపై తుది నిర్ణయం కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీలో హైకమాండ్ కీలక చర్చలు
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా నడుస్తున్న పవర్ షేరింగ్ (Power Sharing) హైడ్రామా చివరకు క్లైమాక్స్కు చేరింది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే (పవర్ షేరింగ్) ఫార్ములా పై స్పష్టత కోసం కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు.. సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ (DK Shivakumar), రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర తో కలిసి అత్యవసరంగా ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధానిలోని ఇందిరా భవన్లో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో కూడిన కాంగ్రెస్ హైకమాండ్.. ఈ ఇద్దరు అగ్రనేతలతో విడివిడిగా, ఉమ్మడిగా సుదీర్ఘ చర్చలు జరిపింది.
ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, గతంలో అనుకున్నట్లుగా నాయకత్వ మార్పు (లీడర్షిప్ చేంజ్) జరగాలని డి.కె. శివకుమార్ వర్గం గట్టిగా పట్టుబడుతోంది. మిగిలిన రెండేళ్ల కాలానికి తనకు సీఎం పీఠం అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సిద్ధరామయ్యను సముదాయించేందుకు ఆయనకు రాజ్యసభ సీటు తో పాటు కేంద్రంలో కీలక బాధ్యతలు, అలాగే ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చేలా హైకమాండ్ ఒక కొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, రాబోయే రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే తాము ఢిల్లీ వచ్చామని ఇరు నేతలు పైకి చెబుతున్నప్పటికీ, కర్ణాటక పీఠంపై అధిష్టానం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై అటు బెంగళూరు, ఇటు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే 2, 3 రోజుల్లోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం సీఎం పదవికే పట్టుబడుతున్నట్లు సమాచారం అందుతుంది.
సీఎం పీఠంపై డీకే శివకుమార్ పట్టు
అధిష్టానం కొత్త ఫార్ములాపై ఉత్కంఠ
రాబోయే రోజుల్లో కర్ణాటక సీఎం పీఠంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. డీకే శివకుమార్ వర్గం పట్టుదల, అధిష్టానం ఫార్ములా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పనుంది.


