
📌 Key Points
- కొమరం భీమ్ నేతృత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల తిరుగుబాటు నేపథ్యం.
- దర్శకుడు అల్లాణి శ్రీధర్ గోండు సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.
- ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో సాగిన పోరాటం, భూపాల్ రెడ్డి వీరోచిత నటన సినిమాకు హైలైట్.
- ఆర్ధిక పరిమితులు ఉన్నా, స్థానిక ఆదివాసీలతో సహజత్వంతో చిత్రీకరణ అద్భుతంగా జరిగింది.
అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొమరం భీమ్’ సినిమా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసులు సాగించిన వీరోచిత పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. గోండు యువకుడి నాయకత్వంలో జరిగిన ‘జల్, జంగల్, జమీన్’ ఉద్యమం, దాని ప్రభావం ఈ దృశ్యకావ్యంలో అద్భుతంగా ఆవిష్కరించబడింది.
కొమరం భీమ్ అసలు కథ
భారత దేశ స్వాతంత్రానికి పూర్వం, కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఏర్పాటు కాకముందే, తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాక పూర్వమే, 1928 నాటికి పూర్వపు ఆదిలాబాద్, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమరం భీం అనే ఆదివాసి గోండు యువకుడి నాయకత్వంలో గోండ్ ఇతర ఆదివాసులు రాజ్యానికి వ్యతిరేకంగా సాగించిన తిరుగుబాటు గురించి యూట్యూబ్లో ఉన్న అసలైన కొమరం భీమ్ సినిమా చూస్తే తెలుస్తుంది.
ఈ చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్, సామల సదాశివ సమాచారం, అల్లం రాజయ్య, సాహు రాసిన కొమరం భీం నవల.. ఇతర సమాచారం చదివి, అడవుల్లో తిరిగి గోండ్ సమాజాన్ని, వారి సంస్కృతిని బాగా అధ్యయనం చేసి ఒక అద్భుత దృశ్య కావ్యంగా ఈ సినిమాని తీసిండు. జల్, జంగల్, జమీన్ అనే నినాదాన్ని మనసుకు తాకే రీతిలో ఆదివాసులు వారి భూమి, నీరు, అడవుల హక్కుల పరిరక్షణ కోసం కొమరం భీం నాయకత్వంలో జరిగిన సవాళ్లు స్క్రీన్పై చూపించడంలో సినిమా విజయవంతమైంది. భూపాల్ రెడ్డి భీమ్ పాత్రలో నటించిన తీరు, నాయకత్వ భారాన్ని, ఆవేశాన్ని, బాధ్యతను ప్రేక్షకులకు బాగా అందించగలిగింది. సినిమాలో పాటలు కూడా ఆయనే రాసిండు. మౌనిక బీమ్ భార్యగా ఆదివాసి యువతిగా ఒదిగిపోయి కనిపిస్తుంది.
ఓడిపోతామని తెలిసీ ప్రాణత్యాగం
దర్శకుడి అద్భుత సృష్టి
మొత్తం 105 నిమిషాల తక్కువ నిడివి ఉన్న ఈ సినిమాలో కథ 1934 లో ప్రారంభం అవుతుంది. తమ భూములను పట్టా ఉందని సాకు చూపి ఆక్రమించుకోవాలని చేసిన ప్రయత్నం భూపోరాటంగా మొదలై ఉద్యమ రూపం దాల్చింది. రాజీ బాట చూపని భీంనీ అతడి సహచరులనూ ద్రోహుల సహకారంతో చుట్టుముట్టి నిజాం సైన్యం చంపిన చరిత్రను ఈ సినిమాలో చూడవచ్చు. ఓడిపోతాం అని తెలిసి తప్పక తిరగబడి పోరాడిన భీం తన అనుచరులతో పాటు వీరుడు వలే 1940 లో చనిపోతాడు.
అత్యంత సహజ చిత్రణతో షూటింగ్
ఆర్ధిక పరిమితులు ఉన్నప్పటికీ ఈ సినిమాని చాలా సహజంగా చిత్రించాడు దర్శకుడు అల్లాణి శ్రీధర్. ఈ సినిమాలో ఒక ఐదారు పాత్రలు తప్ప మిగతా అందరు స్థానిక ఆదివాసీలు. గోండు ఆదివాసి సంస్కృతి సహజత్వం ఈ సినిమాకి అందం. భవాని శంకర్ కెమెరా పని తీరు అద్భుతం. ఎలాంటి జెనరేటర్స్, కృత్రిమ కాంతి లేకుండా సినిమా షూటింగ్ అనే ఆలోచన మనకి ఎక్కడ రాదు. సినిమాకు యం.ఎస్. ప్రాణు రావు రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో పాటలు కూడా భీం పాత్రధారి భూపాల్ రెడ్డినే రాసిండు. గౌతం ఘోష్ సంగీత దర్శకత్వం.
నటీనటుల ప్రతిభ, సాంకేతిక విలువలు
భావి ఉద్యమాలకు ఉత్ప్రేరకం
అనేక కష్టాలకు ఓర్చి ఒక సామాజిక దృక్పథంతో కొందరు మనసు పెట్టి తీసిన ఈ సినిమా 1990 లో పూర్తి అయి రాష్ట్ర నంది అవార్డ్ను పొంది, జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం అవార్డ్స్ సాధించింది. కానీ ఆర్ధిక పరిమితులతో రీల్ పెట్టెలుగా మార్చలేక 20 ఏండ్లు మూలకి ఉండి 2010 జులై 02 న రిలీజ్ అయి చాలా సెంటర్లల్లో 100 రోజులు నడిచింది. ప్రస్తుతం యూట్యూబ్ లో 4 భాగాలుగా ఉన్న ఈ సినిమాని కుటుంబ సమేతంగా అందరు చూడాలి. మన అసలైన చరిత్ర , పోరాటం, వారసత్వం వచ్చే తరానికి అందాలి. ((భీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదం సఫలత కోసం ఇప్పటికి ఎక్కడిక్కడ పోరాటాలు చేస్తున్న ప్రజలకు ఈ సినిమా ఒక ఉత్ప్రేరకంగా ఉంటది.))
కొమరం భీమ్ చిత్రం ఆదివాసీల చరిత్రను, పోరాట స్ఫూర్తిని సహజత్వంతో, గొప్ప కళాత్మక విలువలతో చూపిన అద్భుత దృశ్యకావ్యం. ఇది భావి ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచే ఒక గొప్ప ప్రయత్నం.


