
📌 Key Points
- మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్లో 23 ఏళ్ల గర్భవతి సుస్మిత ఆత్మహత్య.
- పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయాలని భర్త, అత్త వేధించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణలు.
- శ్రీమంతం వేడుక చర్చల సమయంలో భర్త అభిలాష్ అందరి ముందూ డీఎన్ఏ టెస్ట్ డిమాండ్ చేశాడు.
- మృతురాలి తల్లి జనాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఘోర సంఘటన వెలుగుచూసింది. కడుపులోని బిడ్డపై అనుమానంతో భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక ఓ ఐదు నెలల గర్భవతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వేధింపులకు గురైన గర్భవతి సుస్మిత
Pregnant woman Suicide in Medak : మానవత్వాన్ని మంటగలిపే ఘోర సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే, కడుపున పెరుగుతున్న బిడ్డ పుట్టుకను శంకించాడు. కన్నబిడ్డకు డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలంటూ అత్తతో కలిసి తీవ్రమైన వేధింపులకు గురి చేశాడు. ఈ అవమానాలను తట్టుకోలేక ఓ 23 ఏళ్ల గర్భవతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన సుస్మిత (23) అనే యువతికి, మెదక్ జిల్లా గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన గాజుల వ్యాపారి జి. అభిలాష్తో దాదాపు 18 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భవతి. అయితే….. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సుస్మిత ప్రవర్తనపై భర్త అభిలాష్ అనుమానం పెంచుకున్నాడు. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీనికి తోడు అత్త లక్ష్మి కూడా తోడవడంతో సుస్మితకు అత్తగారింట్లో నిత్యం నరకం కనిపించింది.
కూతురు గర్భవతి కావడంతో శ్రీమంతం (బేబీ షవర్) వేడుక ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి జూన్ 23న సుస్మిత తల్లి జనాబాయి, తండ్రి కలిసి గడిపెద్దపూర్లోని కూతురి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వేడుక నిర్వహణపై తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అందరి ముందూ భర్త అభిలాష్ ఘోరానికి ఒడిగట్టాడు. సుస్మిత కడుపున పెరుగుతున్న బిడ్డ తనది కాదని….. ఆ పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తేనే శ్రీమంతం చేస్తానని అందరి సమక్షంలో తెగేసి చెప్పాడు. ఆ సమయంలో స్థానిక కుల పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో గొడవ తాత్కాలికంగా సర్దుమణిగింది.
డీఎన్ఏ టెస్ట్ డిమాండ్, కుటుంబ పెద్దల జోక్యం
కానీ కట్టుకున్న భర్త అంతమంది ముందు క్యారెక్టర్ను శంకించడంతో సుస్మిత తీవ్ర అవమాన భారంతో కుంగిపోయింది. పెద్దలు పంచాయితీ పెట్టి వెళ్లినప్పటికీ…. భర్త, అత్తల వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత… జూన్ 25 సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
మృతురాలి తల్లి జనాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లాదుర్గ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు, నిందితులపై చర్యలు
“బాధిత తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. భార్యను వేధించిన భర్త జి. అభిలాష్తో పాటు అతని తల్లిని శనివారం అరెస్ట్ చేశాం. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాం” అని అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి. శంకర్ మీడియాకు వెల్లడించారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ దారుణ ఘటన సమాజంలో కుటుంబ సంబంధాలపై, మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


