|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎగ్జిబిటర్లకి వణుకు పుట్టిస్తున్న పవన్‌ స్టేట్‌మెంట్‌.. `హరిహర వీరమల్లు` టికెట్‌ రేట్ల కోసమైనా ఛాంబర్‌ ద్వారానే

Published: 27-05-2025, 9:24 AM
ఎగ్జిబిటర్లకి వణుకు పుట్టిస్తున్న పవన్‌ స్టేట్‌మెంట్‌.. `హరిహర వీరమల్లు` టికెట్‌ రేట్ల కోసమైనా ఛాంబర్‌ ద్వారానే

థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల విషయంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ వివాదంలో తగ్గడం లేదు.

2

హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆదేశం.

4

ప్రభుత్వం థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశం.

పవన్ కళ్యాణ్‌ తీవ్ర స్థానం

థియేటర్ల బంద్‌ వివాదం విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ఇంకా సీరియస్ గానే ఉన్నారు. ఈ వివాదంపై అటు అల్లు అరవింద్‌, ఇటు నిర్మాత దిల్‌ రాజు, మరోవైపు ఫిల్మ్ ఛాంబర్‌ సైతం వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయంలో తగ్గడం లేదని తెలుస్తుంది.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ఆఫీస్‌ నుంచి మరో ప్రకటన వచ్చింది. ఎగ్జిబిటర్ల టార్గెట్‌ గా ఈ ప్రకటన ఉండటం విశేషం. థియేటర్ల నిర్వాహణ విషయంలో రాజీపడేది లేదని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని, ధరలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేసింది.

ఏపీ రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వాహణ పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కొత్త సినిమాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు,  వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్.. సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వాహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు.

హరిహర వీరమల్లు టికెట్ రేట్లు

త్వరలో విడుదలయ్యే `హరిహర వీరమల్లు` సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.

టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా ఆదాయం పన్ను కూడా పెరుగుతుంది.

ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని తెలిపారు పవన్‌.

సినిమా హాళ్ల నిర్వహణ

తెలుగు చిత్ర రంగంలో థియేటర్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం, తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు.

బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ .. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు…

బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందనే విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రకటనలో ఎగ్జిబిటర్లకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు పవన్‌.

చివరగా, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఎగ్జిబిటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. టికెట్ ధరలు, థియేటర్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.