
📌 Key Points
- మావోయిస్టుల నిర్మూలన జరగలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటమని ప్రభాత్ కుమార్ అన్నారు.
- దేశవ్యాప్తంగా 13 లక్షల గెరిల్లా సైన్యం ఇంకా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
- అమిత్ షా ప్రకటన ఒక మానసిక యుద్ధమని, ప్రభుత్వం బలగాలను పెంచుతోందని విమర్శించారు.
- లొంగిపోయిన నేతలు భోగభాగ్యాలకు ఆశపడ్డారని ప్రభాత్ కుమార్ ఆరోపించారు.
మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటనలను సీపీఐ(మావోయిస్టు) మాజీ పొలిట్బ్యూరో సభ్యుడు ప్రభాత్ కుమార్ తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, గెరిల్లా సైన్యం ఇంకా సిద్ధంగా ఉందని ఆయన సంచలన ప్రకటన చేశారు.
మావోయిస్టుల నిర్మూలనపై ప్రభాత్ కుమార్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మావోయిస్టుల నిర్మూలన పూర్తిగా జరగలేదని, ‘మావోయిస్టు ముక్త్ భారత్’ లక్ష్యం కేవలం ప్రచార ఆర్భాటమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని సీపీఐ(మావోయిస్టు) మాజీ పొలిట్బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్@మాస్టర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 88 ఏళ్ల వయస్సులో, సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవించి 2020లో విడుదలైన ఆయన ప్రస్తుతం లీగల్గా తన ఇంట్లోనే నివసిస్తున్నారు. బిహార్లోని గయ జిల్లాకు చెందిన ప్రభాత్ ‘సమరభూమి’ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలను, పార్టీలో జరిగిన లొంగుబాట్లను, ప్రభుత్వ యుద్ధ వ్యూహాలను తీవ్రంగా విమర్శించారు. గణపతిలాగే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యమంలోకి వచ్చిన ఆయన వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్యం మూలంగా మానసిక సంతులనం కోల్పోయినట్లు కనిపించారు. ఇప్పటికీ 13 లక్షల గెరిల్లా సైన్యం దేశవ్యాప్తంగా ఉందని చెప్పడం తదితర తీవ్ర వాఖ్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. అయితే, అవి తప్ప అన్ని సమకాలీన అంశాలను ఆయన స్పష్టతతో, మావోయిస్టు సిద్ధాంతానికి, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాకు కట్టుబడి మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యంశాలు:
కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి సాయుధ మావోయిజాన్ని అంతం చేస్తామని చేసిన ప్రకటనను ప్రభాత్ కుమార్ ఒక ‘మానసిక యుద్ధం’గా అభివర్ణించారు. ప్రభుత్వం ఒకవైపు విజయం సాధించామని చెబుతూనే, మరోవైపు అడవుల్లో ఎన్నడూ లేనంతగా బలగాలను పెంచుతోందని ఆయన ఎత్తిచూపారు. కేవలం ఛత్తీస్గఢ్, బస్తర్ అడవుల్లోనే 2 లక్షలకు పైగా భద్రతా బలగాలను ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. ఇది ఉద్యమం బలహీనపడలేదనడానికి నిదర్శనమని వాదించారు. ఆపరేషన్ కగార్ను ఆయన ఆదివాసీలను సొంత అడవుల నుండి తరిమివేసే ‘చివరి దాడి’గా పేర్కొన్నారు. కేవలం తుపాకులతో ఒక సిద్ధాంతాన్ని చంపలేరని, భావజాలం ప్రజా హృదయాల్లో ఉంటుందని ఉద్ఘాటించారు.
పార్టీలోని అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారు లొంగిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మానవ శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, వ్యర్థాలైన కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడం కూడా అంతే ముఖ్యమన్నారు. లొంగిపోయిన వాళ్లు విప్లవ పోరాట ఒత్తిడిని తట్టుకోలేక, భోగభాగ్యాలకు ఆశపడి వెళ్లిన వాళ్లేనన్నారు. పార్టీ నిధులు, బంగారం ప్రజలవని, వాటిని పోలీసులకు అప్పగించడం అంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. వారు వెళ్లడం వల్ల పార్టీకి నష్టం లేదని, పైగా పార్టీ మరింత శుద్ధి అయిందని అభిప్రాయపడ్డారు. వయస్సు పెరగడం వల్ల పోరాటం చేయలేక లొంగిపోతున్నామనే వాదనను ఆయన తోసిపుచ్చారు. 88 ఏళ్ల వయస్సులో తాను కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తుచేశారు.
ప్రభుత్వం చేస్తున్న యుద్ధం మావోయిస్టులపై కాదని, అది అడవిలోని ఖనిజ సంపదపై అని ప్రభాత్ కుమార్ ఆరోపించారు. అడవిలోని బొగ్గు, ఇనుము, బాక్సైట్ నిక్షేపాలను అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ అసలు అజెండా అని ఆయన పేర్కొన్నారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల సూచనల మేరకే భారత ప్రభుత్వం పని చేస్తోందని, ఇజ్రాయెల్ దేశం నుండి అత్యాధునిక డ్రోన్లు, ఏఐ (AI) నిఘా పరికరాలను తెప్పించి ఆదివాసీ గ్రామాలపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేస్తున్న రోడ్లు ఆదివాసీల కోసం కాదని, అవి కార్పొరేట్ కంపెనీల లారీలు తిరగడానికి, పోలీసు వాహనాలు వేగంగా అడవిలోకి వెళ్లడానికి మాత్రమేనని ఆయన వివరించారు.
గెరిల్లా సైన్యం సంసిద్ధతపై సంచలన ప్రకటన
మావోయిస్టులు హింసను ప్రేమిస్తారనే వాదనను ప్రభాత్ ఖండించారు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, రైతుల భూములను లాక్కుంటుంటే మౌనంగా ఉండటం చేతకానితనం అవుతుందని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ పాలకుల చేతుల్లో ఉందని, సామాన్య ఆదివాసీకి అక్కడ న్యాయం జరగదని, అందుకే ప్రజా కోర్టులు, సాయుధ ప్రతిఘటన తప్పనిసరి అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం హింసను ఆపితే తాము కూడా శాంతికి సిద్ధమేనని, కానీ వారు దాడులు చేస్తున్నప్పుడు తాము ఎదురుదాడి చేయడం సహజమని పేర్కొన్నారు.
బసవరాజ్ వంటి అగ్రనేతలు మరణించినా పార్టీకి వచ్చిన లోటు ఏమీ లేదని ఆయన ధైర్యంగా చెప్పారు. పార్టీలో ప్రతి సభ్యుడు ఒక సైనికుడేనని, ఒక నాయకుడు మరణిస్తే తదుపరి నాయకత్వం వెంటనే బాధ్యతలు తీసుకునేలా వ్యవస్థ ఉంటుందని చెప్పారు. పార్టీలో ఐదు ప్రాంతీయ బ్యూరోలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ ఛిన్నాభిన్నం కాలేదని స్పష్టం చేశారు. తుపాకులు కేవలం సాధనాలేనని, ప్రజల చైతన్యమే తమ అసలైన బలమని, దోపిడీ ఉన్నంత కాలం మావోయిజం రూపం మారుతుందే తప్ప అంతం కాదని ఆయన స్పష్టం చేశారు.
– 1960వ దశకం చివరలో (1967-70) పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ఉద్యమం, బీహార్లోని రైతాంగ పోరాటాల ప్రభావంతో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు.
– 1970లలోనే ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తిస్థాయి కార్యకర్తగా అప్పటి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (MCC)లో చేరారు.
అమిత్ షా ప్రకటనను ఖండించిన ప్రభాత్ కుమార్
– బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1995లో ఆయన తొలిసారిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
– 2004లో పీపుల్స్ వార్, ఎంసీసీ గ్రూపులు విలీనమై సీపీఐ(మావోయిస్టు)గా ఏర్పడినప్పుడు, ఆయన కేంద్ర కమిటీతో పాటు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
– ప్రభాత్ కుమార్ను 2011లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రత్యేక బలగాలు అరెస్టు చేశాయి. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. సుమారు 13-14 ఏళ్ల పాటు ఆయన వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. వయోభారం, అనారోగ్య కారణాల దృష్ట్యా, అలాగే కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2020లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
– ప్రభాత్ కుమార్ పార్టీలో గొప్ప సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందారు. పార్టీ పత్రికలకు వ్యాసాలు రాయడం, క్యాడర్కు రాజకీయ తరగతులు బోధించడంలో ఆయన దిట్ట. అందుకే 88 ఏళ్ల వయసులో కూడా ఆయన మాటలకు పార్టీలో, బయట ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ప్రభాత్ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మావోయిస్టు ఉద్యమం ఇంకా సజీవంగా ఉందని, ప్రభుత్వ చర్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.


