
📌 Key Points
- రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే రిఫండ్ ఉండదు.
- 24-72 గంటల మధ్య రద్దు చేసుకుంటే ఛార్జీలో 25% కోత విధిస్తారు.
- కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య అమలులోకి వస్తాయి.
- గతంలో టికెట్ రద్దుపై జీఎస్టీతో కలిపి ఛార్జీలు వసూలు చేసేవారు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక! టికెట్ రద్దు నిబంధనల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా మారిన రైల్వే టికెట్ రద్దు రూల్స్
రైల్వే టిక్కెట్ రద్దు నిబంధనలలో ఒక ప్రధాన మార్పు చేసింది భారతీయ రైల్వే. ఇకపై రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు వరకు ఎవరైనా టిక్కెట్ను రద్దు చేసుకుంటే.. వారికి ఒక్క పైసా కూడా వాపసు లభించదు. రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య ప్రయాణికులు తమ టిక్కెట్ను రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధిస్తారు. అంతేకాకుండా రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటలలోపు టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఎలాంటి డబ్బు రీఫండ్ చేయరు.
రైల్వే బోర్డులోని అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఒక ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య తన టిక్కెట్టును రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధించి మిగిలినది రిఫండ్ చేస్తారు. అదే 72 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మాగ్జిమమ్ రిఫండ్ ఉంటుంది. గతంలో 24 నుండి 28 గంటల మధ్య రద్దు చేసుకుంటే 25 శాతం రుసుము వర్తించేది.
రిఫండ్పై ప్రయాణికులకు ముఖ్య గమనిక
ఒక ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు, లేదంటే రైలు బయలుదేరిన తర్వాత టికెట్ రద్దు చేసుకుంటే వారికి వాపసు (రీఫండ్) లభించదు.
రైలు బయలుదేరడానికి 8 నుండి 24 గంటల మధ్య మీరు మీ టిక్కెట్ను రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 50 శాతం కోత విధించి.. మిగిలినది మీకు వాపసు చేస్తారు. ఈ కొత్త రూల్స్ దశలవారీగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య అమలు చేస్తారు.
ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం
ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 48 గంటలలోపు మీరు మీ టిక్కెట్ను రద్దు చేసుకుంటే.. ఫస్ట్ ఏసీలో ప్రయాణికునికి రూ.240 ప్లస్ జీఎస్టీ తీసివేసి ఇస్తారు. సెకండ్ ఏసీలో ప్రతి టిక్కెట్కు రూ.200 ప్లస్ జీఎస్టీ, థర్డ్ ఏసీ, చైర్ కార్లో ప్రతి టిక్కెట్కు రూ.180 ప్లస్ జీఎస్టీ క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్లో ప్రతి టిక్కెట్కు రూ.120, థర్డ్ ఏసీ, సెకండ్ క్లాస్కు రూ.60 చొప్పున క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మారిన కొత్త రూల్స్తో క్యాన్సిలేషన్ ఛార్జీల్లో మార్పులు ఉంటాయి.
రైల్వే గత సంవత్సరం తమ రైలు సీటు బుకింగ్ విధానంలో కూడా అనేక మార్పులు చేసింది. ఉదాహరణకు, అక్టోబర్ 1, 2025 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా జనరల్-కోటా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు, మొదటి 15 నిమిషాల బుకింగ్ విండోలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ రిజర్వేషన్ విధానం నుండి నిజమైన వినియోగదారులు మాత్రమే ప్రయోజనం పొందేలా చూడటమే దీని లక్ష్యం.
కాబట్టి, రైల్వే ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకునే ముందు కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే రిఫండ్ విషయంలో నష్టపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

