
📌 Key Points
- ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో మూడు రోజులు వర్షాలు.
- తెలంగాణలో పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ.
- ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరిక.
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
ఉత్తర కోస్తా ఏపీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటుగా ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
ఇక తెలంగాణలో చూస్తే గత వారం రోజులుగా వాతావరణం చల్లగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే వాతావరాణశాఖ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
మార్చి 25వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, గదిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఇక మార్చి 26వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వేసవి వేళ అకాల వర్షాలు పడుతుండగా…. వాతావరణం చల్లగా ఉంటోంది.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో ఇవాళ (24-03-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,శ్రీసత్యసాయి,కడప,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.
రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.


